ITR | గత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు గడువు దగ్గరపడుతున్నది. దీంతో సోమవారం వరకు మూడు కోట్ల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారనిఆదాయం పన్ను విభాగం ప్రకటించింది. ఇంతకుముందు మాదిరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంచబోమని పునరుద్ఘాటించింది.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా యూజర్లు.. ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించాలని కోరుతున్నారు. జూలై 31 ఆచరణ యోగ్యం కాదని, శాశ్వతంగా ఆగస్టు 31 వరకు పొడిగించాలని ట్వీట్లు చేస్తున్నారు. #Extend_Due_Date_Immediately అనే హ్యాష్ట్యాగ్తో గడువు పొడిగించాలని కోరుతూ 5000 మందికి పైగా ట్వీట్లు చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించేది లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో తక్కువ సంఖ్యలో ఐటీఆర్లు దాఖలవుతున్నా.. ఇప్పుడు 15 నుంచి 18 లక్షలు దాఖలవుతున్నాయని చెప్పారు. కానీ, కొందరు నెటిజన్లు ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం.