ఇద్దరు విద్యార్థులకు రూ.15 లక్షల మేర కుచ్చుటోపి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ సీటును ఎరగా వేసి సైబర్నేరగాళ్లు మోసగిస్తున్నారు. రెండ్రోజుల్లోనే ఇద్దరు హైదరాబాదీలకు రూ.15 లక్షల మేర కుచ్చుటోపి పెట్టారు. బెంగళూరు కిమ్స్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ ఒకరి వద్ద రూ.10.16 లక్షలు, మరో విద్యార్థి నుంచి రూ.5 లక్షలు కాజేశారు. బాధితురాలు శుక్రవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంబీబీస్ సీట్ల భర్తీ సమయంలో ఈ ముఠాలు పంజా విసురుతుంటాయి. కాలేజీల నుంచి బైపీసీ చివరి ఏడాది చదివే విద్యార్థుల డాటాను సేకరించి, వారికి మేనేజ్మెంట్ కోటాలో సీట్లున్నాయని సెల్ఫోన్లకు మెస్సేజ్లు పంపిస్తాయి. సీటు కావాలని అడిగే వారిని టార్గెట్ చేస్తారు. చెప్పిన కాలేజీకి ఫలాన రోజు వస్తే సీటు కన్ఫమ్ చేస్తామని ముఠా సభ్యులు నమ్మిస్తారు. వారు చెప్పినట్టు ఆయా కాలేజీల వద్దకు అభ్యర్థులు వెళ్తారు. పథకం ప్రకారం ముగ్గురు, నలుగురు సభ్యులు ముందే కాలేజీల్లో ఉంటారు. ఒకరు సీటు కోసం వెళ్లిన వారిని రిసీవ్ చేసుకొని క్యాంపస్ అంతా తిప్పుతారు.
ప్రిన్సిపాల్, చైర్మన్ ఎవరిదో ఒక చాంబర్ వద్దకు వెళ్లి బాధితులను బయట కూర్చోబెడతారు. ముఠా సభ్యులు లోపలికి వెళ్లి వస్తారు. మీ సీట్ కన్ఫమ్ అయ్యిందంటూ బిల్డప్ ఇస్తారు. ఒక లెటర్ కూడా ఇస్తామని, అడ్వాన్స్ చెల్లించాలని సూచిస్తారు. అది నమ్మి బాధితులు డబ్బు అందిస్తారు. సీటు కన్ఫమ్ లెటర్ తీసుకెళ్లి కాలేజీలో చూపించిన తరువాతే అదంతా ఫేక్ అని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.