బజార్హత్నూర్, జూలై 10 : కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిలదీశారు. గర్భిణి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణి ఇటీవల బజార్హత్నూర్లోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకున్నది. ఫోలిక్ యాసిడ్ మాత్రలను సిబ్బంది అందించారు. రెండు రోజుల క్రితం ఆ మందులు వాడింది.
కొద్దిసేపటికే గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖాన తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై శుక్రవారం దవాఖానకు వచ్చి ఆరోగ్య సిబ్బందిని నిలదీశారు. గతేడాది జూలై నెలలో గడువు ముగిసినప్పటికీ చూడకుండా మందులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాత్రలు ఈ దవాఖానలో ఇచ్చినవి కావని వైద్య సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై డీఎంహెచ్వో సాధనను వివరణ కోరగా ప్రభుత్వ దవాఖానలో ఎక్స్పైరీ అయిన మాత్రలు ఎలా పంపిణీ జరిగాయనే విషయంపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.