హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27 : కేయూ పరిధిలో డిగ్రీలు, పీజీలు చదివి.. సర్టిఫికెట్లు పొందేందుకు అభ్యర్థులు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సిబ్బంది కొరత, ఉన్నతాధికారుల అలసత్వంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. ప్రస్తుతం గురుకులాల ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతున్నందున ఉద్యోగార్థులు కాన్వొకేషన్తో పాటు వివిధ సర్టిఫికెట్ల కోసం కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్కు వస్తున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల అక్కడే పిల్లాపాపలతో ఎదురుచూస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని సుమారు 550 కాలేజీలు నడుస్తున్నాయి. వీటిలో ఏటా 70వేల మంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేస్తుండగా, చాలామంది పలు కారణాలతో సర్టిఫికెట్లను సకాలంలో తీసుకోలేకపోతున్నారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ సిబ్బంది స్టూడెంట్లను రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. తీరా సర్టిఫికెట్లు ప్రింట్ అయిన తర్వాత సంతకాల కోసం కంట్రోలర్ అందుబాటులో లేరని, ఒకరు ఉంటే ఇంకొకరు ఉండడం లేదని, అవసరమైతే కంట్రోలర్ ఇంటికి వెళ్లయినా సంతకాలు పెట్టిస్తామని సిబ్బంది అంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
సర్టిఫికెట్ల కోసం వచ్చేవారితో కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ సిబ్బంది అమర్యాదగా మాట్లాడుతున్నారని, నిర్లక్ష్యంగా సమాధానాలిస్తూ, చీదరించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నా సమాచారం తెలిపే హెల్ప్డెస్క్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని వాపోతున్నారు. వివిధ సర్టిఫికెట్ల జారీ కోసం ఫీజులు కట్టించుకుంటున్న ఆఫీసర్లు, ఏ సర్టిఫికెట్ ఎన్నిరోజుల్లో జారీ చేస్తారో చెప్పకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఆన్లైన్లో తత్కాల్ సర్టిఫికెట్ కోసం రూ.వెయ్యి అదనంగా చెల్లించినా నిర్ణీత సమయంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. దూరప్రాంతాల నుంచి రావాలంటే రవాణా ఖర్చులకు ఇబ్బంది అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేయూ ఎగ్జామ్ బ్రాంచ్లో ఎక్కువగా తాత్కాలికంగా పనిచేసే సిబ్బందే ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ల స్థానంలో కొత్తవారిని నియమించక డైలీ వేజ్ వర్కర్లతో నెట్టుకొస్తున్నారు. వీరికి ఆన్లైన్ పనులపై సరైన అవగాహన లేక దరఖాస్తులు పరిష్కారం కావడం లేదనే విమర్శలున్నాయి. వారు తక్కువ వేతనంతో ఒత్తిడి భరించలేక చేయి తడిపితేనే పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో సర్టిఫికెట్లకు డబ్బులు డిమాండ్ చేసిన సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే.
ఎగ్జామ్ బ్రాంచ్ వద్ద సర్టిఫికెట్ల కోసం బారులు తీరుతున్నారు. తెలిసినవారు మాత్రం నేరుగా సర్టిఫికెట్లు ఇచ్చేవారి వద్దకు వెళ్తుండడంతో బయట కిటికీల వద్ద సర్టిఫికెట్ల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నవారు సీరియస్ అవుతున్నారు. పలువురు లోపలికి వస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లోపలికి రావద్దని అధికారులు కొద్దిసేపు అందరినీ బయటకు పంపి తలుపులు వేస్తున్నారు. అయినప్పటికీ దర్జాగా కేయూ దూరవిద్య కేంద్రంలో పనిచేసే ఓ సిబ్బందితో పాటు రిటైర్డ్ అయినవారు అందులో పనిచేసే కొంతమంది సిబ్బంది.. అలా వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకోవడం విశేషం. కంట్రోలర్ మాత్రం క్యాండిడేట్కు మాత్రమే సర్టిఫికెట్లు ఇస్తామని గట్టిగా చెబుతున్నప్పటికీ సిబ్బంది తెలిసినవారైతే చాలు ఇచ్చేయడం కొసమెరుపు.