కాలంలో మంచిది ఉండదు. చెడ్డది ఉండదు. మన చర్యలే కాలాన్ని అనుకూలంగా, ప్రతికూలంగా మారుస్తాయి. ఉందిలే మంచి కాలం అనుకోవడంతో సరిపోదు. పిదప కాలం అంటూ నిస్తేజంలో కూరుకుపోవడం మంచిది కాదు. కాల మహిమను తెలుసుకొని మసలుకోవాలి. కర్తవ్యాన్ని గుర్తెరిగి నిర్వర్తించాలి. అప్పుడు కలకాలం మంచి కాలమే! ఏ కాలమానం అయితేనేం, కొత్త వసంతంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా కాలం గరిమను స్మరించుకుందాం.
తానిచ్చిన వరాన్ని భస్మాసురుడు తనపైనే ప్రయోగం చేస్తాను అనగానే పరమేశ్వరుడే పరుగులు పెట్టాడు.. కాలమహిమ. త్రిపురాసురుల సంహారానికి బయల్దేరుతూ తన కుమారుడైన గణపతిని ఆరాధించాడు శివుడు.. కాలమహిమ. తమ నివాసం కోసం నిర్మించుకున్న లంకాపురిని పార్వతీ పరమేశ్వరులు రావణుడికి దక్షిణగా సమర్పించారు.. కాలమహిమ.రాజలోకాన్ని జయించి రాజసూయ యాగం చేసిన ధర్మరాజు ఏకచక్రపురంలో భిక్షాటన చేసి జీవించాడు.. కాలమహిమ.
నమ్మలేకపోయినా ఇవన్నీ ముమ్మాటికీ నిజాలే. పురాణాల్లో ఉన్నవే. అవును.. అన్నిటికీ కాలమే కర్త. చివరికి భగవంతుడు కూడా కాలానికి లోబడి ఉండాల్సిందే! కాలానికి ధనిక, పేద తేడాలు లేవు. రాజు, బంటు పట్టింపులు లేవు. మంచి, చెడులు అంటవు, పాప, పుణ్యాల భీతి లేదు. తన నిర్ణయం ప్రకారం నడుచుకోవటం ఒక్కటే కాలానికి తెలుసు. ‘సృష్టిలోని ప్రతి ప్రాణీ కాలానికి అనుగుణంగా నడవాల్సిందే. సమయం అశ్వంలా పరుగెడుతుంది’ అని అథర్వణ వేదం కాలమహిమను వర్ణించింది.
కాలానికి ఆది, అంతం లేవు. అది భగవత్ స్వరూపం. అండపిండ బ్రహ్మాండం అంతా కాలంతోనే ముడిపడి ఉంది. ప్రకృతి ధర్మాలు, రుతువులు కాలంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. కాలానికి ఒకరు ఇష్టులు, మరొకరు అయిష్టులు అంటూ ఉండరు. కాలమహిమ ఎంతటిదో అనుభవంలోకి వస్తే గానీ తెలియదు. ఎంత గొప్పవారైనా ఈ విషయంలో తల వంచవలసినదే. అందుకు తార్కాణమే ఈ శ్లోకం.
శ్లో॥ రామో దారవియోగ్య బధ్యత బలిశ్చోరో హతశూద్రకః
ధ్వాంక్షశీఖలు విక్రమార్క నృపతిర్ధర్మోవనం ప్రస్థితః
చండాలాశ్రయ దూషితో బత హరిశ్చంద్రో జగద్వల్లభః
ప్రాప్తేకాలవశే విధిర్బలయుతో దిగ్దగ్వృధాపౌరుషమ్
రాముడికి భార్యా వియోగం కలిగింది. బలికి బంధనం లభించింది. శూద్రకుడిని చోరులు చంపేశారు. విక్రమార్కుడు కాకుల్ని తిన్నాడు. ధర్మరాజు అరణ్యానికి వెళ్లాడు. జగత్తుకు ఇష్టుడైన హరిశ్చంద్రుడు చండాలుడిని ఆశ్రయించి దూషితుడయ్యాడు. కాలం వచ్చినప్పుడు దైవమే బలవత్తరమై మానవుడి శక్తి వ్యర్థం అయిపోతుంది.
కాలగమనంలో మనకు కలిగే సుఖదుఃఖాలకు మనం బాధ్యత వహించకుండా ‘కాలదోషం’ అంటూ కాలానికి పాపాన్ని ఆపాదించటం వివేకవంతుడి లక్షణం కాదు. ‘కాలం చాలా పాడైపోయింది’ అంటూ నిందిస్తుంటాం. మన దోషాల్ని, పాపాల్ని సమర్థించుకుంటూ కాలాన్ని దూషించడం సరైనపని కాదు. మన కర్మలు, ఆలోచనలు కలిసివచ్చి సత్ఫలితం అందితే మంచి కాలమనీ, కలిసిరాక దుష్ఫలితాలు ఎదుర్కొంటే చెడ్డ కాలమనీ అనడం కేవలం అవగాహనా రాహిత్యమే. భారత ఇతివృత్తాన్ని సూచించే ఈ పద్యం కాలమహిమను గొప్పగా ప్రకటిస్తుంది.
రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండీవము విల్లట సారథి సర్వభద్ర సం
యోజకుడైన చక్రి యట యుగ్ర గదాధరుడైన భీముడ
య్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో!
ధర్మరాజు వంటి మహాత్ముడు రాజై ఉండగా, ఇంద్రుని కుమారుడైన అర్జునుడు తన చేతిలో ధనుస్సు ధరించగా, శత్రువులను సంహరించే గాండీవం విల్లు కాగా, అందరినీ రక్షించే శ్రీకృష్ణుడే వీరి పక్షాన రథసారథియై ఉండగా, భయంకరమైన గదను ఆయుధంగా ధరించిన భీముడే ఆ ధర్మరాజుకి తోడుగా ఉండగా పాండవులకు వరుసపెట్టి కష్టాలు కలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాలమహిమ కాకపోతే ఈ విధంగా జరుగుతుందా!
తామరాకు నీటి మీద ఉన్నంతవరకు వాడదు. నీటి చుక్క తనపైన పడినా తడవదు. అలాగే కాలం దేనికీ ప్రతిస్పందించదు. కాలానికి ప్రతిస్పందిస్తున్నది మనిషే! కాలానికి తగినట్లు తనను తాను మలచుకుని, అనుకూలంగా వర్తిస్తూ జీవితాన్ని అర్థవంతం చేసుకోవడమే వివేకశీలి లక్షణం. కాలం ‘ఆదృష్టం’ రూపంలో ఎప్పుడో ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే జ్ఞాని పని. ‘దురదృష్టం’ రూపంలో అదే పలుమార్లు తలుపు తడుతుంది. అర్థం చేసుకుని తలుపులు తెరవకపోవడమే. విజ్ఞుడి లక్షణం.
జీవితం చాలా స్వల్పం. జీవితకార్యం చాలా విస్తృతం. అందుకే రేపటి పని ఇవాళ, ఇవాళ్టి పనిని ఇప్పుడే చేయాలన్నారు మహాత్ములు. ఏ క్షణంలో ఏ ఆపద ఎదురవుతుందో ఎవరు చెప్పగలరు? చేయాల్సిన పనిని వాయిదా వేయటం పిరికివాడి లక్షణం. పోయిన ధనం, క్షీణించిన ఆరోగ్యం, మరిచిపోయిన విద్య, పరహస్తగత సామ్రాజ్యం ఇవన్నీ.. మళ్లీ కృషిచేస్తే పొందవచ్చేమో! గడిచిన కాలాన్ని తిరిగి పొందలేం. పూర్వమహర్షులు జపం, తపం, శాస్త్ర అధ్యయనం, సత్కర్మలతోనే తమ జీవితంలోని ప్రతిక్షణాన్నీ భగవత్ ప్రతీక్షణంతో సద్వినియోగం చేసుకున్నారు. అందుకే మోక్షార్హులయ్యారు.
విషయభోగ లాలసుడైనవాడికి కాలమహిమ తెలియదు. జీవితం విలువ తెలియదు. అది కాలానికి వశుడైనవాడి అసమర్థత. కాలాన్ని మన వశంలో ఉంచుకుని, సమయజ్ఞతను ఆరాధించగలిగితే ప్రతికార్యంలో సాఫల్యమే సిద్ధిస్తుంది. కాలాన్ని ఎదుర్కోవటమనే పురుష ప్రయత్న ప్రాముఖ్యాన్ని భగవంతుడే నిర్దేశించాడు. మన మనసుకైన గాయాలు కానీ, మన తనువుకైన గాయాలు కానీ మానిపోయేలా చేసే శక్తి ఒక్క కాలానికే ఉంది. అందుకే కాలమంత ఆత్మీయబంధువు, ఆపద్బంధువు వేరెవరూ లేరనడం అత్యుక్తి కాదు.
ఉదయాస్తమయాల్లా ప్రతి క్షణమూ అనివార్యమే. ఆ క్షణాన్ని వివేచనలోకి, విచక్షణలోకి అనువదించుకోగలిగే సామర్థ్యం సంపాదించుకోవాలి. అందుకు మహాత్ముల అనుభవాల్ని, ఆశయ ధర్మాలను క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలి. సమాజాన్ని చదవాలి. ద్రౌపది నవ్వుకు అవమాన ఆగ్రహావేశాలకు గురైన దుర్యోధనుడు ఏ క్షణంలో పగ, ప్రతీకార జ్వాలలో మనసును దగ్ధం చేసుకున్నాడో- ఆ క్షణమే అతని మరణానికి నాంది అయింది.
జ్ఞాననేత్రాలను వికసింపజేయగల శక్తిని ప్రసాదించిన ఈ మానవజన్మ మళ్లీ మనకు లభిస్తుందో లేదో! అందుకే మన జీవనకాలాన్ని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు వర్గీకరణ చేసుకోవాలి. పాండవులు కాలానికి వశులైనా, తమ దురదృష్టకర సమయాన్ని అజ్ఞాతవాసంలో సమర్థంగా మలుచుకున్నారు. ‘ధన, జన, యవ్వనాదులు గర్వాన్ని కలిగిస్తాయి. అవన్నీ కాలచక్ర భ్రమణంలో కలిసిపోయేవే’ అంటారు శంకర భగవత్పాదులు. శ్రీకృష్ణుడి కాలధర్మ వార్తకు ఖిన్నుడైన అర్జునుడు వ్యాసుడి వల్ల కాలాతీత తత్వబోధ గ్రహిస్తాడు. ‘సమయమూ, సాగర తరంగమూ ఒకరికోసం ఆగవు’ అని ఆంగ్లసామెత. ‘కాలాయనమః’ అన్న వేద కథనం మనకు సర్వదా స్మరణయోగ్యమైనది.
మనిషి ఆయుర్దాయం నూరేండ్లు. అందులో సగం నిద్రకు, కొంత విశ్రాంతికి, ఇంకొంత అమాయక బాల్యానికి, మరికొంత వృద్ధాప్యానికి, కొంత కబుర్లకు, మరికొంత ప్రయాణాలకు, ఇంకొంత అనారోగ్యాలకు… ఇలా ఖర్చయిపోతుంటే తన జీవితకాలంలో మనిషి ఏం సాధించినట్టు? అందుబాటులో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఉత్తముడి లక్షణం.
..✍ శ్రీ భారతి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గీతా జయంతి స్పెషల్ | భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
తెలంగాణలో ఉన్న బ్రహ్మంగారి మఠం గురించి తెలుసా?
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
గాంధారి మైసమ్మ | మేడారం జాతరలాగే రెండేండ్లకొకసారి జరిగే ఆదివాసీల జాతర గురించి తెలుసా
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?