హైదరాబాద్, జనవరి 30 : ఆంగ్ల మాధ్యమ చదువులు అందరి ఆకాంక్ష అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు బడులకు పునర్వైభవం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మన ఊరు- మన బడి’ పథకంతోపాటు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన, ఫీజుల నియంత్రణకు సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలు చరిత్రాత్మకమని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠపరచి, నాణ్యమైన విద్యను అందించేందుకు ‘మన ఊరు-మన బడి’ పథకం తోడ్పాటునందిస్తుందన్నారు. ప్రపంచస్థాయి పోటీని అధిగమించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంగ్లిష్ మీడియం చదువులు దోహదపడతాయని తెలిపారు. స్కూళ్ల రూపురేఖలను మార్చేందుకు రూ.7,289 కోట్లను ఖర్చుచేయడం ప్రభుత్వ పాఠశాలల పట్ల సీఎం కేసీఆర్కున్న అంకిభావానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధిచేస్తే 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంగ్లిష్ మీడియంతోపాటు, పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటయించిన సీఎం కేసీఆర్కు కమలాకర్రావు ధన్యవాదాలు తెలిపారు.