పీర్జాదిగూడ : మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నయా పైసా అభివృద్ధి చేయలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) ఆరోపించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్ఎస్ (BRS) పై ఉన్న ఆదరణ చూస్తుంటే ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గత ప్రభుత్వాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మారుమూల గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిందని గుర్తు చేశారు. అభివృద్ధి నిరోదకులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వాల హయాంలో ప్రజలు తాగునీరు, సాగునీటికి అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటింటికి నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.