ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : ఈటల రాజేందర్ తన పదవికి స్వార్థం కోసం రాజీనామా చేశాడే తప్ప ప్రజల అవసరాల కోసం కాదని, ప్రజల కోసం రాజీనామా చేయని ఆయనకు ప్రజలు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, పాతర్లపల్లి, బోగం పాడు, గడ్డివానిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వినోద్కుమార్ మాట్లాడుతూ… నాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ తన హామీని నిలుపుకోలేదు కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధించడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశామన్నారు. అప్పుడు ప్రజలు తమ కోసం, తమ ప్రాంతం కోసం రాజీనామా చేశారని మమ్మల్ని దీవించి మళ్ళీ గెలిపించారు.
మరీ ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసినప్పటి నుంచి ఒక కారణమైన చెప్తాడని చూశానని, కానీ ఇంత వరకు చెప్పలేదని, ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే స్పష్టత లేద న్నారు. ఈటలది తన బాధే తప్ప ప్రజల బాధ కాదన్నారు. తెలంగాణ కోసం 2001లో ఉద్యమం మొదలైనప్పటి నుంచి తాను సీఎం కేసీఆర్ వెంట ఉన్నానని తెలిపారు. ఈటల రాజేందర్ మాత్రం 2003లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు.
అప్పుడు ఈటల రాజేందర్ తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని, ఎందుకంటే తన పౌల్ట్రీఫారాలు అక్కడే ఉన్నాయని సీఎంతో చెప్పారని గుర్తు చేశారు. హుజూరాబాద్ ప్రాంతంలో పోటీ చేయనని అక్కడి నుంచి ఎప్పుడో వెళ్లొచ్చానని చెప్పి నట్లు చెప్పారు. అప్పటికే కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కైవసం చేసుకొని జడ్పీ చైర్మన్ కైవసం చేసుకొని జిల్లాలో బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. అలాంటి బంగారు పల్లెం లాంటి ఈ ప్రాంతంలో ఈటల రాజేందర్కు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని వివరించారు.
అలాంటి కేసీఆర్ను పట్టుకొని బొంద పెడ్తా అంటావా అని మండిపడ్డారు. గులాబీ జెండా లేకపోతే నువ్వు పౌల్ట్రీఫాం యజ మానివి మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్ రైతుల ఆత్మవిశ్వాసం పెంచి గౌరవంగా ఉండేందుకు రైతుబంధు కింద 5వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. ఏడాదికి 1200 కోట్లు రైతుబీమా కోసం ఖర్చు చేసి ప్రమాదవశాత్తు చని పోతే కుటుంబానికి 5లక్షలు ఇప్పించి వారి ఆత్మగౌరవాన్ని సీఎం కాపాడారన్నారు. వీటితో పాటు కళ్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్లు, ఉచిత కరంటు, ఒంటరి మహిళకు పింఛన్లు ఇస్తున్న కేసీఆర్కు మానవత్వం లేదంటావా అని ప్రశ్నించారు.
మీ బీజేపీ ప్రభుత్వం పరిపాలించే 15 రాష్ట్రాల్లో, కేంద్రంలో ప్రధాని ఉన్నారు, మరీ ఇలాంటి పథకాలు అక్కడ ఎందుకు లేవో చెప్పాలని ఈటలను డిమాండ్ చేశారు. దళితబంధులాగే మిగతా వారికి కూడా పథకాలు అందజేస్తామన్నారు. తెలంగాణ పేద రాష్ట్రం కాదని, కొత్త పథకాలకు కూడా రూపకల్పన చేస్తున్నామని, అప్పుడు వద్దు అన్నా కూడా ప్రజలు టీఆర్ఎస్ కే ఓట్లు వేసే పథకాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. కావున ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసును గెలిపించాలని కోరారు.
ఈటలవి నయవంచన, మోసపూరిత మాటలు : సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
ఈటల రాజేందర్వి పూర్తిగా నయవంచన, మోసపూరిత మాటలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో రవిశంకర్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ హుజూరాబాద్కు ఏం చేశాడని, ఏం చేశానని ఓట్లు అడుగుతున్నాడన్నారు.
దళితబంధుపై కుట్రలు చేసి ఈటల రాజేందర్ ఆపించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. ఈ నెల 30న సీరియల్ నంబర్ 2 మీద కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి : కనుమల్ల విజయ, జడ్పీ చైర్పర్సన్
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ఇన్ని రోజులుగా కష్టపడి పనిచేసిన మనం, మరో 5 రోజులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే మనమందరం గెలవడమే కాకుండా అభివృద్ధి చెందుతామని చెప్పారు.