హుజూరాబాద్ : బీసీనంటూ హుజూరాబాద్ ప్రజలను మోసం చేసిన ఈటల రాజేందర్కు ఓటు అడిగే నైతికహక్కులేదని టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు అన్నారు. మంగళవారం ఆయన హుజూరాబాద్లో మాట్లాడుతూ బీసీ అని చెప్పుకునే అర్హత కానీ బీసీ ల ఓట్లు అడిగే అర్హత కానీ ఈటలకు లేదన్నారు. ఈటల బీసీయేనా అని ఆయన బీసీ సంఘాల నాయకులను ప్రశ్నించారు. ప్రజా వంచిత యాత్ర చేస్తున్న బండిసంజయ్ కి గానీ,, బీజేపీ కి గానీ, తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ద లేదని ఆయన ఆరోపించారు.
రైతుబంధు పెట్టిన రోజున ప్రతిపక్షాలు ఇలాగే ఓర్వలేదని, కానీ అదే రైతు బంధును కాపీ కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుబంధు లాగే దళితబంధును కాపీ కొట్టి దేశమంతట అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మీ వరంగల్ గడ్డ నుంచి జన్మించిందని, అది అన్ని కులాలకు వస్తున్నది నిజం కాదా? అని లింగంపల్లి ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఒక్క పథకం తేలేని అసమర్థులు బీజేపీ నాయకులు అని ఆయన విమర్శించారు.
రైతులకు పసుపు బోర్డు తీసుకొస్తానన్న అరవింద్ నీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కేంద్రం నుండి ఒక్క ప్రొసీడింగ్ తీసుకోలేకపోవడమేనా మీ అత్మగౌరవం అన్నారు. తెలంగాణ కు ఒక్క సైనిక్ స్కూల్ లేదు. అన్ని హంగులతో కంటోన్మెంట్ విభాగం ఉన్న సైనిక్ స్కూల్ తేలేని అసమర్థులు బీజేపీ నాయకులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇప్పించలేక పోయారు. సుష్మాస్వరాజ్ ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోలేక పోయారని బీజేపీ నేతలను లింగంపల్లి కిషన్రావు విమర్శించారు.
ఎన్నికల కోసమైనా హుజురాబాద్ కు ట్రిపుల్ ఐటీ తెచ్చుకోలేని అసమర్థులు బీజేపీ నాయకులు అని ఎద్దేవా చేశారు. భారతదేశానికి దశ దిశ దళిత బంధు అని, ఉట్టి ప్రగల్భాలు పలికే కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లారా దమ్ముంటే మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేయండి అని ఆయన సవాలు విసిరారు.