కమలాపూర్ : దళితుల భూముల కబ్జాపై ప్రభుత్వం ప్రశ్నించినందుకే ఈటల బీజేపీలో చేరిండని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆదివారం కమలాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రాడ్యుయేషన్ అసోసియేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దళితుల భూములను లాక్కుంటే ఊకోవాల్నా అని ప్రశ్నించారు.
కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారిని నమ్మి ఎమ్మెల్యే, మంత్రిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్పై కుట్రలు చేశాడని మండిపడ్డారు. హైదరాబాద్ శివారు మాసాయిపేటలో దళితుల భూములు కబ్జా చేసి, ఇబ్బందులకు గురిచేసున్నాడని ఫిర్యాదులు వస్తే విచారణకు ఆదేశిస్తే ఎక్కడ బాగోతం బయటపడుతుందోనని రాజీనామా చేసిండని విమర్శించారు. ఎంపీగా బండి సంజయ్ గెలిచి రూపాయి పని కూడా చేయలేదని, రేపు ఈటల గెలిస్తే ఏం చేస్తడని ప్రశ్నించారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆరేనని కొనియాడారు. నాటి తెలంగాణకు, నేటి తెలంగాణకు ఎంత మార్పు వచ్చిందో చదువుకున్న వ్యక్తులుగా ఆలోచన చేయాలన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసే గొప్ప వ్యక్తి కేసీఆర్ అని, ఎవరు అడగకుండానే కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు పెట్టిండని గుర్తుచేశారు.
తెలంగాణ ఉద్యమంలో రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఎక్కడున్నరని సుమన్ ప్రశ్నించారు. ఒక్క పోలీస్ దెబ్బన్న పడ్డరా? ఒక్క కేసైనా నమోదు అయిందా? ఇలాంటి వాళ్లు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను తిట్టడం సరైందేనా అని ప్రశ్నించారు. ఈటల గెలిస్తే ఈటలకే లాభం, గెల్లు శ్రీనివాస్ గెలిస్తే జూరాబాద్ ప్రజలందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్యాదవ్ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండ శ్రీనివాస్, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, మాజీ మంత్రి ఎల్.రమణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు స్వర్గం రవి, మోతె చిరంజీవి పాల్గొన్నారు.