ఆదిలాబాద్, ఫిబ్రవరి 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో ఎలా వెలుగులు తీసుకోవచ్చాయో తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్తులు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో గ్రామానికి రూ.33 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. గ్రామంలో 202 కుటుంబాలు ఉండగా 802 జనాభా ఉంది.
ముక్రా (కే)లో ఇటీవల నిర్వహించిన గ్రామసభలో పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేశారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాలతో తమ ఉపాధి మెరుగుపడిందని, తమకు వచ్చిన పథకాల వివరాలను ఇంటిముందు రాయాలని గ్రామస్తులు కోరారు.
సర్పంచ్ మీనాక్షి గాడ్గే ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ సంక్షేమం..ప్రతి ఇంటికీ కేసీఆర్ అనే ఫ్లెక్సీలను అతికించారు. వీటిలో ఆ కుటుంబం ఎలాంటి పథకాలు పొందింది.. ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి ఇంట్లో కనీసం ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రుణమాఫీ లాంటి ఐదు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో ఒక్కో కుటుంబం కనీసం రూ.5 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు సర్కారు సాయం పొందారని పేర్కొన్నారు. తమ ఇంటి ముందు అతికించిన ఫ్లెక్సీతో గ్రామస్తులు సెల్ఫీలు దిగి ఇతరలకు పంపిస్తున్నారు.