వర్ధన్నపేట/రాయపర్తి/తొర్రూరు/ పర్వతగిరి, ఆగస్టు 17 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలకు గోదావరి జలాలు విడుదల చేయాలని, చెరువులను నింపి పంటలకు సాగునీరందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డి మాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు నీళ్లందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలా రం నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారిమడూరు వరకు 10 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాల్వ వెంట పాదయాత్ర నిర్వహించారు.
అంతకు ముందు వర్ధన్నపేట మండలం రామోజీకుమ్మరిగూడెం ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ రెండో ప్రధాన గేటు వరకు కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, బైక్లతో తరలిరాగా వారితో కలిసి ఎండిపోయిన కాల్వను పరిశీలిస్తూ నాంచారిమడూరుకు కాలినడకన చేరుకున్నారు. మధ్యలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలపగా, వాహనాల రాకపోకలు నిలిచిపోయారు. విషయం తెలిసిన పోలీసులు చేరుకొని ఎర్రబెల్లిని అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వానలు పడక రైతులు పంటలు సాగుచేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని, కాళేశ్వరం నుంచి మిడ్మానేరు మీదుగా ఎస్సారెస్పీలోకి నీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తూ రైతులపై రాజకీయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారుకు రైతుల గోస తాకుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా కాల్వల ద్వారా గోదావరి జలాలు చెరువుల్లోకి తరలించడంతో పదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు రెండు పంటలు పండించారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే తమకు అప్పగించాలని, 15 రోజుల్లో రైతులకు సాగునీరందిస్తామన్నారు. రైతు భరోసా, యూరి యా, విద్యుత్ సరఫరా, పంట రుణమాఫీ తదితర అంశాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు బీమా ప్రీమియం గడువు ముగిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పంటలకు సాగునీరందించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ హయాంలో రైతులు, మహిళల కోసం అమలు చేసిన పథకాలను కొనసాగించాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దు యోచనను విరమించుకొని తులం బంగారం అందించే హామీని అమలు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్రెడ్డితో పాటు వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు, పర్వతగిరి, పెద్దవంగర మండలాల నాయకులు పాల్గొన్నారు.