తిరుపతి, ఆగస్టు:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయన సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగి రిటైర్మెంట్ రోజే అతనికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు. దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
బ్రహ్మోత్సవాల నాటికి తిరుమలలో ఉద్యాన వనాలన్నీ అభివృద్ధి చేసి భక్తులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని జవహర్ రెడ్డి చెప్పారు. ఘాట్ రోడ్లలో విరిగి పడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుమలలో అవసరమైన చోట కాటేజీల రూఫ్ పై సోలార్ సిస్టం ఏర్పాటు చేసి యాత్రికులకు వేడి నీళ్లు అందించాలని ఆయన అన్నారు. అలిపిరి ఫుట్ పాత్ పైకప్పు నిర్మాణం పనులు, కాటేజీల అభివృద్ధి పనులపై ఈవో సమీక్షించారు.