శ్రీశైలం : దసరా మహోత్సవాలు శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సాయంత్రం దక్షిణ మాడవీధి ప్రాంగణంలోని కళావేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన లయ బీట్స్ ఆఫ్ ఆర్ట్స్ బృందం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు సంప్రదాయ నృత్య ప్రార్థన చేసి వినాయక కౌత్వం, భో శంభొ శివశంభో, గజవదనా, ఒక పరి కోకపరి, నటేశ కౌత్వం, కంజధలయ తాక్షి కామాక్షి, నవ దుర్గ శక్తి అయిగిరి నందిని.. మోహినీ భస్వాసుర నృత్య రూపక ప్రదర్శనలను చూపరులను కట్టిపడేశాయి. ముడుంబా వేదవ్యాస్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ప్రధానంగా చిన్నారులు దుర్గా, హనీ, యుక్తా, నాగశ్రీ, త్రైలోక్యలు చేసిన నాట్య రూపకాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వేడుకల్లో నాట్య ప్రదర్శనకు అవకాశం కల్పించిన దేవస్థానానికి లయ బీట్స్ ఆఫ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు స్రవంతి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.