ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ పూర్వ సభ్యుడు, తెలుగు తప్పనిసరి అమలు కమిటీ సభ్యుడు, రీడింగ్ క్యాంపెయిన్ స్టేట్ కోఆర్డినేటర్, కరికులమ్ రూపకల్పన, పరీక్షల సంస్కరణల కమిటీ సభ్యుడు సువర్ణ వినాయక్ ప్రత్యేక కథనం…
ఆంగ్లం, ఆంగ్ల మాధ్యమం వల్ల రాష్ట్రంలో తెలుగుకు ముప్పు వాటిల్లదని గుర్తించాలి. ఎందుకనగా 2018లో రాష్ట్ర ప్రభుత్వం తెలుగును 1 నుంచి 10వ తరగతి వరకు ఒక సబ్జెక్టుగా, తప్పనిసరిగా అన్ని యాజమాన్యాల్లో, అన్ని పాఠశాలల్లో బోధించాలని చట్టాన్ని చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్సీ, ఐబీ వంటి సంస్థలకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు కూడా ఈ చట్టం వల్ల తెలుగును బోధిస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా తెలుగు మాధ్యమం ఉండడం కూడా గమనించాలి. సహజంగానే తెలుగు భాష, సాహిత్యాభిమాని అయిన వ్యక్తి కే చంద్రశేఖర్రావు. వారే సీఎంగా ఉండి తెలుగు బోధన తప్పనిసరి చట్టాన్ని రూపొందించి అమలుపరుస్తున్న సందర్భంలో తెలుగుకు ముప్పు వాటిల్లుతుందని భావించడం సరైంది కాదు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత చేపట్టిన చర్యలను కూడా గమనించాలి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నెలకొల్పిన సాహిత్య అకాడమీ ఎనలేని కృషి చేయడం మనం చూస్తున్నదే. భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమి, ఇతర విశ్వ విద్యాలయాలు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ), తెలంగాణ నాటక పరిషత్తు వంటి సంస్థలు చేస్తున్న కృషి, సేవలు, కార్యక్రమాలు తెలుగు ఉనికిని శాశ్వతం చేయడానికి, అభివృద్ధి పర్చడానికి తోడ్పడుతున్నాయి.
మేధావులు రేకెత్తించిన సందేహాలు వాస్తవాలైనప్పటికీ అసాధ్యమైనవి కావు. అవరోధాలు అంతకంటే కావు. ప్రజాభిప్రాయం ప్రకారం రాజకీయ సంకల్పంతో తీసుకునే నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలుపరిచినపుడు ఫలితాలు ఆశాజనకంగానే ఉంటాయి. ఇందుకు ఈ కింది చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.
ఆంగ్ల బోధనలో ఆదర్శం.. మక్తా అనంతారం బడి
ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఆదర్శంగా నిలుస్తున్నది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్తా అనంతారంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల. 2014లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి.. దశలవారీగా విస్తరించుకుంటూ నేడు 156 మంది విద్యార్థులతో కళకళలాడుతున్నది. ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లోనూ, సైన్స్ ఫెయిర్లలోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారు.
చదువు విజ్ఞానం కోసం మాత్రమే కాదు, ఉపాధి మార్గం కూడా!
దీనిని సాకారం చేయడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీసుకున్న ఆంగ్ల భాషా మాధ్యమం అమలు నిర్ణయం అవశ్యమైంది, స్వాగతించదగినది. ఏ విధానపరమైన నిర్ణయానికైనా ప్రారంభంలో సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. వాటిని అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలను కనుగొనడం ద్వారా విజయవంతం చేయవచ్చు. నిధులను సాధించి నీటి వనరులను సృష్టించుకొని కరువు తెలంగాణను హరిత తెలంగాణగా మార్చిన ఘనత కలిగిన ముఖ్యమంత్రి నిర్ణయం విజయ పథంలో పరుగెడుతుందని చెప్పడానికి సందేహం అవసరం లేదు. బడుగుల జీవితాల్లో వెలుగులను నింపే ఈ నిర్ణయం మరో చారిత్రకాంశంగా మిగులుతుందని ఆశిద్దాం.