ఎల్లారెడ్డిపేట, జూలై 9: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా సంబంధిత యంత్రాంగం పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. 12 రోజుల క్రితం అల్మాస్పూర్లోని రెడ్డి సంఘం భవనం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిన ఘటన మరువక ముందే వారంక్రితం తిమ్మాపూర్లోని ఐదో నంబర్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయింది.
మరమ్మతులు చేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని, నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. తిమ్మాపూర్ శివారులో గొల్లపల్లికి చెందిన దాసరి సత్తయ్యకు పదెకరాల వ్యవసాయ భూమి ఉండగా, వరి సాగుకోసం దుక్కి దున్ని నీళ్లు పారించాడు. మరోసారి నీళ్లుపారించేందుకు కరెంట్ లేకపోవడంతో గురువారం ట్రాక్టర్ ఇంజిన్ డైనమోను జనరేటర్లా ఉపయోగించాడు. కనీసం 6 రోజులైతేనే మొత్తం నీరు పారుతుందని, రోజుకు 15 లీటర్ల డీజిల్ అవుతున్నదని వాపోతున్నాడు. అధికారులు ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయించాలని కోరాడు.