న్యూఢిల్లీ: వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. విద్యుత్తు సరఫరాలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించేలా ఈ బిల్లు అవకాశం ఇవ్వనున్నది. కాంగ్రెస్, లెఫ్ట్, టీఎంసీ, డీఎంకే పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రాజ్యాంగంలో సమాఖ్యా సూత్రాలను ఉల్లంఘించినట్లు ఉందని పార్టీలు ఆరోపించాయి. విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ సరికాదన్నారు. విపక్ష పార్టీలు విద్యుత్తు బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విద్యుత్తు శౄఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఈ బిల్లు వల్ల రైతులకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఉచిత కరెంటు కొనసాగుతుందన్నారు. విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది రైతు వ్యతిరేక బిల్లు అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ ఆరోపించారు.