హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): సంకుచిత విధానాలతో కేంద్రం వ్యవహరిస్తున్నదని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజల ఆహార్యంతో ప్రభుత్వాలకేం పని? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలు తేనె పూసిన కత్తిలా ఉన్నాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సీఎం ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. హైదరాబాద్లో ఫార్మా పరిశ్రమ బ్రహ్మాండంగా పురోగమిస్తున్నది. ప్రపంచంలోని ఎంత పెద్ద ఫార్మా కంపెనీ అయినా హైదరాబాద్లో స్టార్ట్ చేయవచ్చు. రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టే వాతావరణాన్ని కల్పించాం. బెంగళూరులో, హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా, మన దేశం వాళ్లు మాత్రమే కాదు అనేక దేశాల వాళ్లు పనిచేస్తారు. మత కలహాలు పెట్టి.. ప్రజలను విడదీసి.. ఒకరి మీద ఒకరిని పడేసి తన్నేస్తే! బెంగళూరు విమానం దిగంగనే కర్ఫ్యూ ఉంటదట. హిజాబ్ పంచాయితీ.. ప్రజలు తొడుక్కొనే ఆహార్యం మీద పంచాయతీ.. ఒకాయన జుట్టు వేసుకుంటడు.. ఒకాయన ధోతీ కట్టుకుంటడు.. ఒకాయన షేర్వాణీ వేసుకుంటడు. ప్రజల ఆహార్యంతోని ప్రభుత్వానికేం సంబంధం? దాన్నొక అంశంలా చిత్రీకరిస్తూ.. సంకుచిత విధానంతో వ్యవహరిస్తే ఈ దేశం ఎక్కడికిపోతది?
విద్యుత్తు సంస్కరణలు తేనె పూసిన కత్తి
రాజకీయాలు పెడధోరణులు పడుతున్నాయి. విద్యుత్తు సంస్కరణలు తేనె పూసిన కత్తి వంటివి. గ్లోబల్ వార్మింగ్, రేడియేషన్ తగ్గాలె. అందుకోసం రెన్యువబుల్ ఎనర్జీ కొనాలె. ఎంత ఘోరమంటే.. వాళ్ల తాబేదారుల దగ్గరే కొనాలె. మీ దగ్గర సంప్రదాయేతర ఇంధన వనరులున్నా మా దగ్గర్నే కొనాలంటరు. నాగార్జునసాగర్, శ్రీశైలంలో మన దగ్గర హైడల్ పవర్ ఉన్నా బంద్చేసి వాళ్లు పెట్టేది కొనాలట. కొనకపోతే జరిమాన. మీది గ్రీన్ పవర్ కాదు.. మేం పెట్టేదే గ్రీన్ పవర్. ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం ఇది.
యువత భవిష్యత్తు అగమ్యగోచరం అయితది
హైదరాబాద్లో వాతావరణం బాగుంటదట.. అక్కడ ఫార్మా.. ఐటీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు.. అంటే ఎవరైనా వస్తారు. కానీ.. ఎయిర్పోర్ట్లో దిగగానే.. కత్తులు పట్టుకొని పొడుసుకుంటరట.. కర్ఫ్యూ ఉంటదట.. 144 సెక్షన్ ఉంటదట అంటే ఎవరొస్తరు? సానుకూలంగా ఉన్న వాతావరణం ధ్వంసమైతే.. లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్యగోచరం అయితది. నాకిలా చెప్పాలంటే బాధగా ఉన్నది. ఇది పూర్తిస్థాయి పెడధోరణి. ఏ రకంగాను దేశానికి మంచిది కాదు. దయచేసి యువత ఈ ఉన్మాదుల చర్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలె. దశాబ్దాల తరబడి అనేక మంది శ్రమ మీద.. అనేక వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన వ్యవస్థలో ఎం జరుగబోతావుంది? దీనిమీద కూడా తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంగా చెప్పదలచుకున్న.
నేను సచ్చినా.. మీటర్లు పెట్టం..
ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖాల్లో నవ్వు వస్తాంది. ఇండియాలో ఏ రాష్ట్రమైనా కల్తీ విత్తనాల మీద పీడీయాక్ట్ పెట్టిందా? కల్తీ విత్తనాలపై కేసులు పెట్టిన ఒకే రాష్ట్రం తెలంగాణ. భట్టిగారు అన్నట్లు ఎక్కడో ఒకటో, అరో ఉండొచ్చు. కల్తీ విత్తనాలను సమూలంగా నివారించాల్సిందే. ఉక్కుపాదంతో వ్యవహరించాలని వ్యవసాయశాఖ మంత్రిని ఆదేశిస్తున్నా. దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే 24 గంటల కరెంటిస్తున్నం. రైతులు ఆనందంగా పంటలు పండిస్తున్నరు. మీటర్లు పెడితేనే ఎఫ్ఆర్బీఎంలో 0.5 శాతం మీకిస్తమని కేంద్రం షరతు విధించింది. నేను సచ్చినా సరే మీటర్లు పెట్టం అని చెప్పిన. ఈ ఆంక్షలు ఐదేండ్లకు పెట్టిన్రు. ఐదేండ్లు ఇంటూ 5వేలు అంటే 25వేల కోట్లు తెలంగాణ నష్టపోతది. ఇది కేంద్రం అవలంబించే దుర్మార్గమైన పాలసీ. ఇది నిజం.