దుబ్బాక, జూన్ 8 : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. ఈ ప్రమాదంలో సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. చీకోడ్ గ్రామానికి చెందిన బీడీ టేకేదారు పుట్ట లక్ష్మీనారాయణ ఆరు నెలల క్రితం రూ.80 వేలు పెట్టి ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా తన ఇంటి ఎదురుగా ఉండే బొందనగారి దుర్గయ్య ఇంట్లో తన బైక్కు చార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో మూడుసార్లు భారీ శబ్దాలు రావడంతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు.
లక్ష్మీనారాయణతోపాటు చుట్టు పక్కలవారు బయటికి వచ్చి చూడగా.. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఎలక్ట్రిక్ వాహనం దగ్ధం కాగా దుర్గయ్య ఇంటికి నిప్పంటుకోవడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు వాపోయారు.