హైదరాబాద్, మార్చి 12, (నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఘోర పరాభవంతో కాంగ్రెస్ పార్టీలో కుతకుత మొదలైంది. ఇప్పటిదాకా ఐసీయూలో ఉన్న పార్టీ ఒక్కసారిగా కోమాలోకి వెళ్లిపోయినట్టయింది. ఒకటిన్నర శతాబ్దపు చరిత్ర గలిగిన పార్టీ.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కేవలం రెండు రాష్ర్టాల్లోనే అధికారానికి పరిమితం కావడంతో అసంతృప్తి నేతలు స్వరం పెంచుతున్నారు. కాంగ్రెస్ అసమ్మతి నేతల బృందం (జీ-23) సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఇంట్లో వరుసభేటీలతో తీవ్రంగా సమాలోచనలు సాగిస్తున్నారు. ఆదివారం సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే సమావేశంలో అస్త్రశస్ర్తాలు సంధించడానికి సిద్ధమయ్యారు. ఐదు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ కాడి దించేయడంతో జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయమన్న భ్రమలు పూర్తిగా తొలిగిపోయాయి. దీంతో ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి దిశగా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను నమ్ముకోవడం వృథా, మన దారి మనం చూసుకోవడమే మేలు అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ మమతాబెనర్జీ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. బీజేపీకి ప్రాంతీయ పార్టీల కూటమి ఒక్కటే ప్రత్యామ్నాయం కాగలదన్న ఆమె అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ కూడా గళం కలపడం ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదనకు మరింత బలం చేకూర్చేలా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పీకలదాక అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇక ఆ పార్టీని వదిలేసి ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా జత కట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక తమ పదవులకు రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. మొదట ఎన్డీటీవీ ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తమకు తెలిసిందని పేర్కొన్నది. గాంధీ కుటుంబం రాజీనామా కథనాలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలన్నీ నిరాధారమైనవని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. అందులో నిజం లేదని పేర్కొన్నారు. అలా ఊహించి వార్తలు రాయడం సరికాదన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం శనివారం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియాకు పంపించారు. ఆయన జేడీఎస్లో చేరనున్నట్టు సమాచారం. ఇబ్రహీం మాజీ కేంద్రమంత్రి. జేడీఎస్ అధినేత దేవెగౌడకు సన్నిహితుడు. 1996-98 మధ్య కేంద్రమంత్రిగా పనిచేశారు. 2008లో కాంగ్రెస్లో చేరారు. బీకే హరిప్రసాద్ను కర్ణాటక శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేతగా పార్టీ ఇటీవల నియమించింది. ఈ నిర్ణయంపై ఇబ్రహీం ఆగ్రహంతో ఉన్నారు. ఇబ్రహీం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావగా అభివర్ణించారు. ఆత్మగౌరవం ఉన్నవాళ్లెవరూ కాంగ్రెస్లో ఉండబోరన్నారు.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చ, విశ్లేషణకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఇటీవల మళ్లీ ఆజాద్ నివాసంలో సమావేశమైన జీ-23 నేతలపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లలో ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా పూర్తిగా చేతులు ఎత్తేయడం అధినాయకత్వ వైఫల్యంగా ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకపోవడం, బీజేపీని ఎదుర్కోగలిగే వ్యూహం లోపించడం వల్లే ఐదు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ అధోగతికి కారణంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఇంట్లో గత రెండు రోజులుగా సమావేశమైన జీ 23 నేతలు పార్టీ ఘోర పరాజయానికి కారణాలపైనే విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. ఇంతకాలం తాము ఇదే విషయాన్ని చెప్తే అధినాయకత్వం పెడచెవిన పెట్టడం వల్లనే పార్టీ తగిన మూల్యాన్ని ఐదు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో చవిచూడాల్సి వచ్చిందని భావిస్తున్నారు. పార్టీ పూర్తిగా అస్తిత్వ సంక్షోభంలో పడిపోవడంతో ఇంతకాలం గుంభనంగా వ్యవహరించిన ఈ నేతలు ఆదివారం సోనియాగాంధీ సమక్షంలో జరుగబోయే సీడబ్ల్యూసీ భేటీలో గట్టిగా నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో ఇప్పుడే అంచన వేయలేమని ఈ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అప్రమత్తం కాకపోతే పార్టీ మనుగడ కష్టమని సూచించాలనే నేతలు కొందరు ఉండగా, ఆ సమావేశానికి వెళ్లడం కూడా వృథా అనే అభిప్రాయానికి కూడా మరికొందరు నేతలు వచ్చినట్టు చెప్తున్నాయి. పార్టీ నాయకత్వాన్ని రాహుల్గాంధీకి కాకుండా పార్టీలో సమర్థులైన మరెవరికైనా అప్పగిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టమన్న తమ అభిప్రాయాన్ని అధినాయకత్వానికి తెగేసి చెప్పడానికి జీ 23 నేతలు సన్నద్ధమవుతున్నట్టు కూడా ఈ వర్గాలంటున్నాయి. పార్టీ అగ్రనాయకుడు, సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే శశిథరూర్ కూడా పార్టీ నాయకత్వాన్ని మార్చాల్సిన తరుణం ఆసన్నమైందని అర్థం వచ్చేలా ట్వీట్చేయడం తాజాగా ఆ పార్టీలో సంక్షోభానికి అద్దం పడుతున్నది. పార్టీ ఎదుర్కొంటున్న అస్తిత్వ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ మూకుమ్మడిగా ఆదివారం జరుగబోయ సీడబ్ల్యూసీలో రాజీనామాలకు సిద్ధపడినా అశ్చర్యపోనవసరంలేదన్న ఎన్డీ టీవీ కథనం.. ఐదు రాష్ర్టాల ఫలితాలు కాంగ్రెస్ అదిష్ఠానాన్ని ఎంత పెద్ద కుదుపునకు లోను చేశాయో ఈ కథనం చెప్పకనే చెప్తున్నది. తాజా ఎన్నికల ఫలితాలకు కాంగ్రెస్ అధినాయకత్వం కారణం కాదని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీ శివకుమార్ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.