నిరంకుశ పోకడ, సంకుచిత మనస్తత్వం గల మోదీ దేశ ప్రధాని పదవికి తగిన వ్యక్తి కాడు. సువిశాల భారత్ వివిధ మతాలు,జాతులు, సంస్కృతుల సమాహారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజిల్లుతున్న దేశానికి ఇంద్రధనస్సు ఎలాగైతే అన్ని రంగులను తనలో ఇముడ్చుకున్నదో అలాంటి స్వచ్ఛమైన నీటి బిందువు వంటి మనస్తత్వం గలవాడే ప్రధానిగా అందరి మెప్పు పొందగలడు. మోదీకి ఈ మనస్తత్వం లేదు. ఆయన మతోన్మాద భావనలను ఇముడ్చుకున్న వ్యక్తి. భారత సంస్కృతిలో సమ్మిశ్రితమై ఉన్న ఇతర మతాలను, వారి మనోభావాలను ఆదరించే మనో వైశాల్యం మోదీకి లేదు. అన్నిమతాల ప్రజలను కలుపుకొని పోతూ, అందరికీ ప్రాతినిధ్యం వహించలేడు.
తెలంగాణ రాష్ట్రం కోసం అరవై ఏండ్ల పాటు ప్రజలెంత పరితపించారో, ఎంత ఉద్యమం నడిపారో, ఎన్ని ప్రాణాలు పణంగా పెట్టారన్న చరిత్ర మోదీకి తెలియదు. తెలిస్తే, పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును తప్పుపడుతూ మాట్లాడేవాడు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవహేళన చేస్తూ మాట్లాడి ఆయన యావత్ తెలంగాణ ప్రజలను అవమానపరిచారు. ఇందుకు తెలంగాణ బీజేపీ నాయకులంతా సిగ్గుపడాలి. తెలంగాణ కోసం పద్నాలుగేండ్ల పాటు పోరాటం చేసి, రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి అహరహం కృషిచేస్తున్నారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కేంద్రంతో స్నేహాన్నే ఆయన కాంక్షించారు. మోదీకి స్నేహహస్తాన్ని అందించారు.
గత ఏడేండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా మద్దతిచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించి మోదీకి సహకరించారు. విశాల దృక్పథంతో ఇన్ని రకాలుగా సహకరించినందుకా ఈ రోజు తెలంగాణను కించపరచడం!
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వానికి ఇంత మద్దతిస్తున్నా, రాష్ట్రంలోని బీజేపీ నేతలు కేసీఆర్ను అడుగడుగునా విమర్శించడం, దూషించడం పరిపాటైంది. ఇవన్నీ టీఆర్ఎస్ నాయకత్వం ఎంతో సహనంతో ఓర్చుకుంది. అయినా బీజేపీ ధోరణిలో మార్పు లేదు. దాంతో సహనం నశించిన తెలంగాణ ప్రజల స్పందనే కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రతిధ్వనించింది. కేసీఆర్ నుంచి కోట్లాది తెలంగాణ ప్రజల భావాలు వెలికివచ్చాయి. రాష్ట్రంలో ప్రజలంతా సామరస్యంగా శాంతి, సౌభాగ్యాలతో ఉండటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గిట్టడం లేదు. వారికి కావలసిందల్లా తెలంగాణలో మత కలహాలు పెచ్చరిల్లి, మైనారిటీలు అభద్రతా భావంతో బతుకడమే. ఆ పరిస్థితి ఇక్కడ లేనందున బీజేపీవారు కండ్లల్లో నిప్పులు పోసుకొని రాష్ట్రంపై విషం కక్కుతున్నారు. మోదీ పనంతా తన అనుయాయులైన పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడం. పేదలు, రైతుల పట్ల ఆయనకు ఎంతమాత్రం కనికరం లేదు. పెట్టుబడిదారులకు మేలు చేకూర్చే రైతు వ్యతిరేకచట్టాలను అందుకే తెచ్చారు.
తెలంగాణ కొత్త రాష్ట్రమైనా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కేసీఆర్ బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేస్తున్నారు. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకం దేశంలోనే ఒక సంచలనం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే తెలంగాణను ఆదర్శంగా తీసుకొ ని ఇక్కడి పథకాలను అమలుచేస్తున్నాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని భావించిన కేసీఆర్ పోలీస్ శాఖను బలోపేతం చేశారు. నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేసి ప్రజల భద్రతకు భరోసాగా నిలిచారు. దీంతో రాష్ట్రంలోని అన్ని మారుమూల ప్రాంతాలను కూడా సీసీ కెమెరాల ద్వారా అనుసంధానం చేయడం జరుగుతున్నది. ఈ కేంద్రం పనిచేయడం ప్రారంభిస్తే, రాష్ట్రంలో జీరో క్రైమ్ రేటు నమోదవుతుందనటంలో సందేహం లేదు.
కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఉదారంగా నిధులు మంజూరు చేయాల్సిందిపోయి మోదీ ప్రభుత్వం రాష్ర్టానికి హక్కుగా రావలసిన నిధులను కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఒక భాగమన్న విషయాన్ని విస్మరించి, ఫెడరల్స్ఫూర్తికే మోదీ ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నది. ఈ ధోరణి ఎంతమాత్రం ఉపేక్షించలేనిది. దేశరక్షణ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం రాజీపడుతూ అవినీతికి పాల్పడుతున్నది. దాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీని హేయమైన భాషలో విమర్శించడం బీజేపీ నీచ సంస్కృతికి నిదర్శనం. ఎవరినీ మాట్లాడనీయని అప్రజాస్వామిక పంథాలో బీజేపీ నాయకత్వం నడుస్తున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ మొదటినుంచీ తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. రాష్ట్ర ఏర్పాటే జీర్ణం చేసుకోలేని విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు అనుకూలం అంటూనే, పార్లమెంటులో జరిగిన ప్రక్రియను తప్పుబట్టడం అంటే.. మొత్తంగా తెలంగాణ ప్రజలనూ, పార్లమెంటునూ కించపర్చటమే.
ఇటువంటి నియంతృత్వ బీజేపీని, ఆ పార్టీ నేతలను దేశం అసహ్యించుకుంటున్నది. అప్రజాస్వామిక ధోరణులను పాతరేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఇందుకు కేసీఆరే నాయకత్వం వహించి దేశానికి బీజేపీ చీడను వదిలించాలి. ఇందుకుగానూ దేశ క్షేమాన్ని కోరే ప్రజలు, నాయకులంతా కేసీఆర్ బాటలో నడువాలి.
( వ్యాసకర్త: రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్)
కోలేటి దామోదర్