మన సమాజంలోని స్త్రీలకు, పురుషులకు విద్యావకాశాలు ఒకేసారి అందుబాటులోకి రాలేదు. దీంతో స్త్రీ, పురుషుల అక్షరాస్యతలో వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అక్షరాస్యత 66.54 శాతంగా ఉంటే అది పురుషుల్లో 75.04 శాతంగా, మహిళల్లో 57.09 శాతంగా ఉన్నది. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన తర్వాత బాలికల పాఠశాలలు, మహిళా కళాశాలలు ఏర్పడ్డాయి. దీంతో మహిళలకు ఉన్నత విద్య, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విద్య అందుబాటులోకి వచ్చింది. నేడు రాష్ట్రంలో పదుల సంఖ్యలలో కళాశాలలున్నా మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీ లేకపోవడం శోచనీయం. దీంతో మహిళలు పీజీ విద్యలో, పరిశోధనారంగాల్లో పురుషులతో సమానంగా రాణించలేకపోతున్నారు.
తెలంగాణ ప్రాంతంలో పరిశోధనారంగం విస్తృతంగా అందుబాటులోకి రావాలంటే ఇక్కడ కూడా ఓ మహిళా యూనివర్సిటీ స్థాపించాలనే డిమాండ్ ఉద్యమకాలం నుంచే ఉన్నది. దీనిపై పలు దినపత్రికల్లో ఎన్నో వ్యాసాలు కూడా అచ్చయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ కల సాకారమవుతున్నది. వచ్చే రెండేండ్లలో కోఠి మహిళా కళాశాలలో మహిళా యూనివర్సిటీని ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించటం ముదావహం.
ఈ నేపథ్యంలో చారిత్రక నేపథ్యం ఉన్న కోఠి మహిళా కళాశాల గురించి ఓ సారి చర్చించుకుందాం. నిజాం సంస్థానంలో 1924కు పూర్వం అక్షరాస్యత అతి తక్కువ. సమాజంలో సగభాగమైన స్త్రీలలో మరీ దారుణంగా ఉండేది. ఆ రోజుల్లో సంస్థానంలో విద్యాబోధన ఉర్దూ మాధ్యమంలో జరిగేది. దీంతో చాలామంది మహిళలు విద్యాభ్యాసం మీద ఆసక్తి చూపేవారు కాదు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన సంస్థానంలోని ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలని సంకల్పించి 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఉస్మానియా స్థాపించిన ఆరేండ్లకు అంటే 1924లో నాటి ప్రధాని సర్ అక్బర్ హైదరీ ఉర్దూ బోధన భాషగా ఒక మహిళా కళాశాలను సంస్థానంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మీర్ ఉస్మాన్ అలీఖాన్కు ఇచ్చారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఒక మహిళా కళాశాల 1924 సెప్టెంబర్ 24న ఏర్పడింది. అదే నేటి ఉస్మానియా యూనివర్సిటీ కోఠి మహిళా కళాశాల.
కొత్తగా ఏర్పడబోయే మహిళా యూనివర్సిటీకి ఎవరి పేరు పెడితే సముచితంగా ఉంటుందో ఓసారి చూద్దాం. రెండవ, మూడవ నిజాం నవాబులకు వివిధ రంగాలలో తన విశిష్ట సేవలందించిన నాటి ప్రధాని రుక్కుద్దౌల అంతరంగికురాలిగా ఉన్న ప్రముఖ వాగ్గేయకారిణి ‘మహాలఖాభాయి’ గొప్ప కవయిత్రి. ఈవిడ రచించిన ఉర్దూ గజల్స్ ‘గుల్జార్-ఎ-మహాలఖా’గా ప్రచురితమయ్యా యి. ఈమె దక్కనీ ఉర్దూలో మొదటి కవయిత్రిగా గుర్తిం పు పొందింది. ఈవిడ హైదరాబాద్ సంస్థానానికి చేసిన సేవలకు గుర్తింపుగా నాటి రెండవ నిజాం మీర్ నిజాం అలీఖాన్ హైదర్గూడ, అడిక్మెట్, మెట్టుగూడ, చందానగర్ ప్రాంతాలను జాగీర్లుగా ఇచ్చారు. అవివాహిత అయిన మహాలఖాభాయి తన చివరి రోజుల్లో తనకిచ్చిన ఆ జాగీరు భూములన్నింటిని తిరిగి నిజాంకు ఇస్తూ వాటిలో విద్యాసంస్థలు నెలకొల్పాలని విన్నవించుకున్నది. ఆమె విన్నపాన్ని మన్నించి అడిక్మెట్, మెట్టుగూడ ప్రాంతాల మధ్యలో 1918లో ఏడవ నిజాం ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మహాలఖాభాయి తను నివాసం ఉన్న నాంపల్లి భవనంలో నాంపల్లి మహిళా కళాశాల కొలువుదీరి ఉన్నది. దానికి నాంపల్లి మహిళా కళాశాల అనే పేరు పెట్టారే తప్పా, ఆమె పేరు మాత్రం పెట్టలేదు. చరిత్ర పుటల్లో మహాలఖాబాయి పేరు కనుమరుగైపోతున్నది. ఈ నేపథ్యంలో రాబోయే రెండేండ్లలో రూపుదిద్దుకోబోతున్న కోఠి మహిళా యూనివర్సిటీకి ‘మహాలఖాబాయి’ పేరు పెడితే సముచితంగా ఉంటుందనేది మా అభిమతం.
– ప్రొ.జి.లక్ష్మణ్
– ప్రొ.ఎం.వెంకటేశ్వర్రావు
– ప్రొ.జి.సుదర్శన్రెడ్డి
– ప్రొ.ఎస్.ఎ.షుకూర్