స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న వేళ- గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే కళా శకటాల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న దురుసుతనం, వివక్ష వివాదాస్పదమవుతున్నది. ఈ సారి కేంద్రం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ర్టాలకు చెందిన కళాఖండాలను తిరస్కరించడం తీవ్రవిమర్శలకు తావిస్తున్నది. ఈ మూడు రాష్ర్టాలను పాలించే రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమైనవి కావడం గమనార్హం. దక్షిణాది రాష్ర్టాలలో బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్ర శకటాన్ని మాత్రమే ఆమోదించడంలోని మతలబు ఏమిటి? గతంలో తెలంగాణ శకటం కూడా తిరస్కరణకు గురైంది. ఈ శకటాల ఎంపిక విషయమై కేంద్రం అనుసరిస్తున్న విధానమే సమాఖ్య స్ఫూర్తి కోణంలో అభ్యంతరకరంగా ఉన్నది.
కేరళ రాష్ట్రం ప్రముఖ సంఘ సంస్కర్త, తాత్వికుడు నారాయణ గురు విగ్రహాన్ని శకటంపై చేర్చింది. రక్షణశాఖ నియమించిన కమిటీ శంకరాచార్య విగ్రహాన్ని చేర్చాలని సూచించిందట. ఇందుకు కేరళ అంగీకరించలేదు. దీంతో కేరళ శకటానికి ఆమోదం లభించనే లేదు! ఎవరి విగ్రహాలు పెట్టాలనేది కేరళ నిర్ణయించు కోకూడదా! సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, అరబిందఘోష్ వంటి ప్రముఖులతో కూడిన పశ్చిమ బెం గాల్ శకటం కూడా ఆమోదానికి నోచుకోకపోవడం ఆశ్చర్యకరం. తమిళనాడు తమ శకటంలో స్వాతంత్య్ర వీరుల ఆకృతులను తీర్చిదిద్దింది. కానీ వీటి ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంలో నిపుణుల కమిటీ ఘోరంగా విఫలమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలను ఎదిరించి పోరాడిన యోధురాలు రాణి వేలు నాచియార్ ఎవరో కమిటీ సభ్యులకు తెలువకపోగా, విగ్రహం ఝాన్సీ లక్ష్మీబాయిని పోలి ఉందని కమిటీ వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. ఆమె విగ్రహానికి తమిళదనం అద్దాలని సూచించారట! తమిళదనం అంటే ఏమిటో పాఠాలు చెప్పించుకునే స్థాయిలో తమిళులు ఉన్నారా? వీవో చిదంబరనార్ను వ్యాపారిగా ముద్రవేయడం వారి అజ్ఞానానికి పరాకాష్ట! బ్రిటిష్ వారిని అన్నివిధాలా ఎదిరించి, పోరాడిన చిదంబరనార్, షేర్లు సమీకరించి షిప్పింగ్ కంపెనీ పెట్టడం ద్వారా వారి వ్యాపారాన్ని దెబ్బతీయ ప్రయత్నించి జైలు పాలయ్యారు. షిప్పింగ్ కంపెనీ పెట్టడం ఆయన దేశభక్తిలో ఒక పార్శం మాత్రమే!
శకటాల తిరస్కరణపై విమర్శలకు కేంద్రం ఇస్తున్న వివరణ హాస్యాస్పదంగా ఉన్నది. శకటాల ఆమోదానికి ఒక కమిటీని ఏర్పాటుచేస్తారు. ఆ కమిటీ పదేపదే ప్రతిపాదనలను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ మార్పులను సూచిస్తూ ఉంటుంది. పలు దశలుగా పరిశీలనలు జరిపి, ఇంటర్వ్యూలు తీసుకొని సూచనలు చేసి, చివరికి తిరస్కరించడానికి కారణాలు కూడా చూపరు. అనేక సవరణలు చేసి, ఆమోదం పొందినా తమ శకటం ప్రదర్శనలో ఉండకపోవచ్చు. కళాఖండాలలో ఏది ఉత్తమం, ఏది అధమం అని నిర్ణయించడం సాధ్యమా, భావ్యమా? ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండటం- మొదలైన కొలువలేని ప్రాతిపదికలను పెట్టుకొని కేంద్రం రాష్ర్టాల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నది. ఈసారి రాష్ర్టాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి 56 ప్రతిపాదనలు వస్తే, 21 మాత్రమే తర్వాతి పరిశీలనకు ఆమోదం పొందాయట! దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత క్షోభ అనుభవిస్తున్నాయో తెలుస్తూనే ఉన్నది.
కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ర్టాలు తీవ్ర నిరసన తెలిపాయి. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమ రాష్ట్ర గణతంత్ర ఉత్సవాలలో ప్రదర్శించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రీతిలో తమ తిరస్కృత శకటాన్ని జిల్లాలలో ప్రదర్శిస్తామని తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇది ఆయా కళాకారులకు ఊరడింపు అని అర్థం కాదు. కేంద్ర వివక్షాపూరిత విధానాల పట్ల ఆయా రాష్ర్టాలు తెలిపే నిరసన.
కోట్లాది ప్రజలను పాలించే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక శకటాన్ని రూపొందించుకోలేవా? దీనికి కమిటీ ఆమోదాల పేర ఒక సంక్లిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి, ఇంతగా వేధించడమెందుకు? ఇదేమైనా వెయిట్ లిఫ్టింగా, పరుగు పందెమా? రాష్ర్టాల మధ్య పోటీ పెట్టి ఎంపిక చేయడానికి! ఏదైనా రాష్ట్రంలోని సాంస్కృతిక చిహ్నం, వ్యక్తీకరణ ఆ రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్రానికే ఎక్కువగా అర్థమవుతుందా? ఎవరి కళారీతులు వారివి.. కేంద్రం పెట్టే కొలతలలో అన్నీ ఇమడగలవా? పలు దేశాల కన్నా భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద రాష్ర్టాలు మనకున్నాయి. వాటికంటూ జాతి, భాష సాంస్కృతిక అస్తిత్వం ఉంటుంది. చరిత్ర ఉంటుంది, మనోభావాలుంటాయి. గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం అంటూ తమ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటుకోవడంగానే భావిస్తాయి. ప్రతి రాష్ర్టానికి ఒక శకటం ప్రదర్శించుకొనే అవకాశం ఇస్తే నష్టమేమిటి?
ఇదిలా ఉంటే ఈ ఎంపిక విధానం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రవేశపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు సమర్థించుకోవడం వింతగా ఉన్నది. కాంగ్రెస్ హయాంలో ఉన్న ఎన్ని విధానాలను మోదీ ప్రభుత్వం మార్చలేదు. పాత ప్రభుత్వంపై నెట్టేయకుండా, ఒక మంచి మార్పు చేపట్టవచ్చు కదా! పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ర్టాల శకటాలను గతంలో ఆమోదించాము కదా అని కూడా కేంద్ర ప్రభుత్వం అంటున్నది. కొన్ని కీలక సందర్భాలలోనే కదా వివక్ష ఎంత ఉన్నదనేది బయటపడేది. గతంలో కొన్ని ఆమోదం పొందినప్పటికీ, ఈ క్రమంలో ఎంత శ్రమ పడవలసి వస్తున్నదో, ఎంతగా అవమానాలు పొందవలసి వస్తున్నదో గమనించాలి. కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు తక్షణం తమ విధానాలను మార్చుకోవాలె. రాష్ర్టాల మనోభావాలను గౌరవించడం నేర్చుకోవాలె. భిన్నజాతులు, సంస్కృతులు గల దేశం మనది. అంతా సమిష్టిగా పాలించుకుంటున్నామనే భావన కలిగించాలె. కేంద్రం ఇప్పటికైనా ఒక మెట్టు దిగివచ్చి అన్ని రాష్ర్టాల శకటాలను అనుమతించాలె. దీనివల్ల అమృతోత్సవాల వేళ- అన్ని ప్రాంతాల అస్తిత్వ ప్రదర్శనలతో గణతంత్ర వేడుకలు మరింత శోభాయమానంగా మారుతాయి.
–సహ్య