లోక్సభ ఎన్నికలు రెండేండ్ల సమీపానికి వచ్చిన స్థితిలో జాతీయ ప్రత్యామ్నాయ ఆవిర్భావం గురించిన ఆలోచనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పనిచేస్తున్నది.ప్రతిపక్షాలు మాత్రమే కాదు. అది వారు సహజంగానే చేస్తారు. ఇక్కడ అంటున్నది వివిధ వర్గాల సాధారణ ప్రజలు, ఆలోచనా పరుల గురించి. ఎన్నికలకు తగినంతకాలం ముందునుంచే వాటిగురించి సాధారణ సమాజం ఆలోచించటం అరుదుగా తప్ప జరగదు. పరిస్థితులకు అదొక అసాధారణ సంకేతం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం.
మామూలుగానైతే ఏమి జరుగుతుంది? అధికార పక్షం తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతిపక్షాలు అది సాధించాలని కోరుకుంటాయి. అందుకోసం ప్రయత్నాలు ఒకప్పుడు చివరి ఏడాది కాలంలో జరిగేవి. తమ పరిపాలనను చూసి ప్రజలు తమకు ఓటేస్తారని అధికారపక్షం, ప్రభుత్వ వైఫల్యాలపై తమ విమర్శలను విని తమకు మద్దతిస్తారని ప్రతిపక్షాలు భావించేవి. అదీ గాక తమతమ హామీలకు ఆకర్షితులవుతారని ఆశించేవి. క్రమంగా ఇది మారింది. ప్రజలకు ఇరువురి పట్లా నమ్మకాలు తగ్గుతుండటంతో ఎవరికీ తమ గెలుపు పట్ల భరోసా లేకుండాపోసాగింది.
ఆ విధంగా కొత్త దశ ప్రవేశించి, ఎన్నికలు జరిగిన కొద్ది మాసాలకే తిరిగి ఎన్నికల ప్రయత్నాలు మొదలవసాగాయి. కుల మత సమీకరణలు, ప్రలోభాలతో ముఖ్యుల ఆకర్షణలు, విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు పలు విధాలుగా ధనరాశులు సమకూర్చుకోవటం వంటివి చేయసాగారు. ఇదంతా పార్టీలు, నాయకుల స్థాయిలో జరిగేది. ఇందుకు భిన్నంగా సాధారణ సమాజంలోని వివిధ వృత్తులు, వ్యాపకాలవారు ఆ పరిధిని దాటి రాజకీయాలు, ఎన్నికల గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు చూడవచ్చు లెమ్మన్నది వారి వైఖరిగా ఉండేది. ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలో, మధ్యంతరానివో ప్రతి ఆరు నెలలకు ఎక్కడో ఒక్కచోట అన్నట్లుగా కాకుండా నిర్ణీత సమయంలోనే వస్తుండేవి.
తర్వాత ఇదంతా మారిపోయింది. పైన అనుకున్నట్లు ప్రభుత్వాలకు, పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత పోవటం, ఏదో ఒక విధంగా గెలవాలని ఏడాది తిరగకుండా ప్రయత్నాలు మొదలుపెట్టడం, ఎన్నికలు కూడా తరచుగా వస్తుండటం, కుల-మత, ధన ప్రభావాలు పెరుగుతుండటం వంటి పరిణామాలన్నీ కలిసి ఎన్నికలను ప్రజలలో ఒక నిరంతర చర్చగా మార్చాయి. అందుకు తగినట్లు సమాజంలోని వివిధ వర్గాలలో ఎన్నికల జీవులు అనేక రెట్లు పెరిగారు. అయితే మనం పైన అసాధారణ సంకేతం అన్నది దేని గురించి? పార్టీలు, నాయకులు, ఎన్నికల జీవులు ఎన్నికల గురించి తలమునకలుగా ఆలోచించటం ఒక స్థితి. ఇవిగాక మూడవ స్థితి ఒకటి ఉంటుంది. అది, ఈ రెండు తరగతులకు భిన్నమైన సాధారణ ప్రజా వర్గాలు తమంతట తాముగా తమ రాజకీయస్థితిని, పరిపాలనను, పరిస్థితులను, మంచిచెడులను, కర్తవ్యాలనూ ఎన్నికల కన్నా చిరకాలం ముందునుంచే ఒక నిరంతర చర్చగా మార్చుకోవటం. పైన అన్నట్లు ఈ పని తమంతట తాము చేయటం.
కాలం గడిచినా కొద్దీ ఈ నష్టాలు పేరుకుపోతున్నాయి. నష్టపోయే వర్గాలు పెరుగుతున్నాయి. వారికి తర్వాతనైనా ఏ విరామం లేకుండా సమ్మెటపోట్లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉన్నాయి. వారందరిని సమీకరించే వేదికలు గతంలో వలె రూపు తీసుకోవటం లేదు గాని, లేనట్లయితే పరిస్థితి మరొక విధంగా ఉండేది.
అటువంటి అసాధారణ లక్షణాలు కొన్ని ఇప్పుడు కనిపిస్తున్నాయి. మనది సువిశాల దేశం. అయినందున అంతటా ఒకేవిధంగా లేకపోవచ్చు. ఆలోచనలకు గల కారణాలు. స్వభావం ఒక్కటే అయినా ఆయా స్థానిక పరిస్థితులను బట్టి స్థాయీభేదాలు ఉండవచ్చు. కానీ అసాధారణతలు మాత్రం కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి ఈ సాధారణ ప్రజావర్గాలు కూడా తమంతట తాము గానే ఎన్నికల గురించి చర్చిస్తున్నాయి. ఇదే గమనించలసిన స్థితి.
వివిధ వర్గాల ప్రజలు తమకు ఒక పరిపాలనలో మంచి లేదా చెడు తరచూ జరుగుతున్నప్పుడు, గణనీయంగా జరుగుతున్నప్పుడు రానున్న ఎన్నికల గురించి తగినంత ముందునుంచి చర్చించుకుంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం గురించిన ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. ఆ విధంగా ముందునుంచీ ఆలోచనలు చైనాతో యుద్ధం, ఎమర్జెన్సీ, బ్యాంకుల జాతీయీకరణ తదితర సందర్భాలలో జరిగాయి. ఇది కొన్ని సందర్భాలలో ఇంచుమించు దేశవ్యాప్తంగా, కొన్నిసార్లు అధిక ప్రాంతాలలో కన్పించింది. ప్రస్తుతానికి వస్తే రైతాంగ సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పెద్ద నోట్ల రద్దు, మతతత్వ ధోరణులు, పౌరహక్కుల అణచివేత, రాష్ర్టాల ఫెడరల్ అధికారాలను మునుపెన్నడూ లేనంతగా కుంచింపజేస్తూ పోవటం వంటివి వరుసగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వపు మొదటి విడతలోనే ఉండిన ఈ విధానాలు రెండవ విడతకు వచ్చేసరికి ఇంకా ఉధృతం అవుతున్నాయి. ఇది కాకతాళీయం గాక, ఉద్దేశపూర్వకంగా పట్టుబట్టి మరీ, విమర్శలను, వ్యతిరేకతలను లెక్కచేయక చేస్తున్న పని అని అర్థమవుతూనే ఉంది. ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి ఒక నష్టం కాగా, మరొకరికి మరొక నష్టం కలుగుతున్నది.
కాలం గడిచినా కొద్దీ ఈ నష్టాలు పేరుకుపోతున్నాయి. నష్టపోయే వర్గాలు పెరుగుతున్నాయి. వారికి తర్వాతనైనా ఏ విరామం లేక సమ్మెటపోట్లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉన్నాయి. వారందరిని సమీకరించే వేదికలు గతంలో వలె రూపు తీసుకోవటం లేదు గాని, లేనట్లయితే పరిస్థితి మరొక విధంగా ఉండేది. లోగడ ఏర్పడిన ప్రత్యామ్నాయ వేదికలు విఫలమై విశ్వాసాన్ని కోల్పోవటం ఇందుకు ఒక కారణం. అదెట్లున్నా ఒక వాస్తవం ఏమంటే, సాధారణ ప్రజా వర్గాలు, వివిధ ప్రాంతాలూ రానున్న ఎన్నికల గురించి సగకాలం నుంచే మాట్లాడుకుంటున్నాయి. అశాంతిగా ఉన్నాయి. ఇది చివరికి ఏ విధంగా పరిణమించగలదన్నది ఇప్పుడే చెప్పలేము. అది పరిస్థితులపై ఆధారపడుతుంది. కానీ చర్చ, అశాంతి మాత్రం నిజం.
టంకశాల అశోక్