తెలంగాణలో తమకు బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆ పని కాంగ్రెస్ సీనియర్లే చేసి పెడుతుండగా.. స్టార్ కాంపెయినర్ విజయశాంతినే పక్కనపెట్టామని చెప్తున్నారు. మరి మీ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరంటే, బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియాకు చెప్పిన విషయం వినలేదా? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకునేముందు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్కుమార్రెడ్డిని సంప్రదిస్తే.. మారు మాట్లాడకుండా గో హెడ్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినట్టు కొండా వెల్లడించారు. మరి రేవంత్రెడ్డి ఏమన్నారనడిగితే, వద్దంటారని కలువలేదని చెప్పుకొచ్చారు. మీకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నాయకులు కూడా బీజేపీలోకి వస్తున్నారా? అనడిగితే… ఫ్యూచర్లో వస్తారేమోనని అన్నారు. కాంగ్రెస్ వారే తమ పార్టీని ప్రమోట్ చేస్తుండగా.. ఇక బ్రాండ్ అంబాసిడర్ల అవసరం ఏముందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
టీపీసీసీ అనుబంధ సంఘాల్లోకి కొత్తగా రెబల్స్ వింగ్ అనేది ఒకటి చేరింది. పార్టీ నుంచి గతంలో బహిష్కరించిన నేతలను ఇందులో చేర్చుకుంటారు. టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డిపై తొలి తిరుగుబాటు నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి దీని బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో తుంగతుర్తిలో అద్దంకి దయాకర్పై తిరుగుబాటు అభ్యర్థిగా వడ్డేపల్లి రవి అనే అతను పోటీచేసి పార్టీ అభ్యర్థిని ఓడించారు. దీంతో అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది. కాగా ఇటీవల అతను కోమటిరెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. సస్పెన్షన్ ఎత్తివేయకుండానే ఎలా చేర్చుకుంటారని డీసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అతన్ని సస్పెండ్ చేసిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఇప్పుడా పదవిలోనే లేనప్పుడు అతని ఉత్తర్వులు ఎలా చెల్లుతాయని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై టీపీసీసీ అధినేత రేవంత్రెడ్డికి అద్దంకి ఫిర్యాదు చేస్తే, రెబల్స్ను తిరిగి చేర్చుకునే బాధ్యతలను కోమటిరెడ్డికి పార్టీ అప్పజెప్పిందేమో? ఆ విషయం తనకైతే తెలియదంటున్నారట.
ప్రధాని మోదీ, అమిత్ షా హైదరాబాద్ ఎందుకు వస్తున్నారని బీజేపీ నేతలను అడిగితే, జాతీయ కార్యవర్గంలో పాల్గొనేందుకని చెప్తున్నారు. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్నేమో టీఆర్ఎస్ను గద్దె దింపేందుకని అంటున్నారు. మీ పాదయాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో జరిగిన సభలో టీఆర్ఎస్ను ఓడించడానికి తాము రావాల్సిన అవసరం లేదు, బండి ఒక్కడు చాలని అమిత్ షానే అన్నారు కదా? అని గుర్తుచేస్తే.. అవును నిజమే, మా ఊరు యాదమ్మ వంటలు బాగా చేస్తుందని మాటల మధ్యలో మోదీకి చెప్తే, అయితే ఒకసారి వచ్చి టేస్టు చేస్తానని చెప్పారన్నారు. ఓహో వాళ్లు వచ్చేది అందుకా?. నిజమే మరి.. మీ మీటింగ్ కంటే యాదమ్మ వంటలకే ఎక్కువ పబ్లిసిటీ వచ్చినట్టు ఉంది.. జర చూసుకోరాదే!
– వెల్జాల