హైదరాబాద్: హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆరు లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు బీజేపీ అభ్యర్థి కే మాధవీ లత ఆరోపించారు. ఆ ఆరోపణలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఓటరు జాబితా గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందులో తన పాత్ర ఏమీ లేదన్నారు. ఓటరు జాబితాలో కొత్త పేర్లను జోడించడం, తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం లాంటివన్నీ ప్రతి ఏడాది ఎన్నికల సంఘం చూసుకుంటుందన్నారు. ఈసీకి తానేమీ హెడ్ను కాదు అని ఓవైసీ అన్నారు. బోగస్ ఓట్లతో ఓవైసీ గెలుస్తారని మాధవీ లత కామెంట్ చేసిన నేపథ్యంలో ఓవైసీ స్పందించారు. బోగస్ ఓట్లు అంటే అది ఎన్నికల సంఘాన్ని అవమానించడమే అవుతుందని అన్నారు. ఇలా మాట్లాడి హైదరాబాదీ ఓటర్లను అవమానిస్తున్నారని, ఇక్కడ దళిత, వెనుకబడి, మైనార్టీ ముస్లింలు, క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారని, అందరి ఓట్లతోనే ఎంఐఎం విజయం సాధిస్తోందన్నారు.