Earthquake : టిబెట్ (Tibet) లో బుధవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్ (Nepal) లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలు (Ricter Scale) పై ఈ భూకంప తీవ్రత 5.3 గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొన్నది.
కాగా భారత జాతీయ భూకంప పరిశోధన కేంద్రం మాత్రం భూకంప తీవ్రతను 5.0 గా నిర్ధారించింది. టిబెట్లో సంభవించిన ఈ భూకంపం కారణంగా నేపాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. గత గురువారం కూడా టిబెట్లో భూకంపం సంభవించింది.
అప్పట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైందని, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.