హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 01 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎర్లీబర్డ్ స్కీమ్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఏప్రిల్లో మొత్తంగా రూ.965.26 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.742.41 కోట్లు, రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రూ.222.85 కోట్లు వసూలైనట్టు మున్సిపల్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో నిర్దేశిత లక్ష్యం (రూ.600 కోట్లు) కంటే రూ.142.41 కోట్లు అధికంగా వసూలైనట్టు వెల్లడించారు. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో నిరుడు ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన రూ.122 కోట్ల రాబడితో పోలిస్తే ఈసారి ఏప్రిల్లోనే వసూళ్లు రూ.100 కోట్లు పెరిగినట్టు వివరించారు. గతంలో చాలామంది ఆర్థిక సంవత్సరం చివరి మాసం (మార్చి)లో ఆస్తి పన్ను చెల్లించేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెల (ఏప్రిల్)లోనే ఆస్తి పన్ను చెల్లించినవారికి ఈ పథకం కింద మున్సిపల్ శాఖ 5% రాయితీ ఇస్తున్నది.
దీంతో పన్ను రాయితీ కోసం ఎర్లీబర్డ్ పథకాన్ని ఉపయోగించుకొంటున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ పథకాన్ని రెండు (ఏప్రిల్, మే) నెలలకు వర్తింపజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఈ పథకం గడువు ముగిసింది. అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా 11.03 లక్షల మంది ఈ పథకాన్ని ఉపయోగించుకొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 7.50 లక్షల మంది, మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 3.53 లక్షల మంది ఆస్తి పన్ను చెల్లించారు.
మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, సీడీఎం ఎన్ సత్యనారాయణ నిరంతరం ఎర్లీబర్డ్ పథకం అమలుతీరును పర్యవేక్షిస్తూ, పన్ను వసూళ్లలో వేగం పెంచేందుకు కృషి చేశారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సెల్ఫోన్ ద్వారా సంక్షిప్త సమాచారం పంపించి, ఎర్లీబర్డ్ స్కీమ్పై అవగాహన కల్పించారు. ఈ చర్యల ఫలితంగానే రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.