అసంఘటిత కార్మికులకు వరం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం
పోర్టల్లో ఉచితంగా పేర్లు నమోదు చేసుకునే అవకాశం
నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలో నగదు జమ
గుమ్మడిదల, డిసెంబర్ 27 : కష్టకాలంలో అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ సురక్షబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఏదైనా పరిస్థితుల్లో మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.రెండు లక్షలు బీమా సాయం అందుతుంది. అలాగే, పాక్షిక అంగవైకల్యమైతే రూ.లక్ష అందజేస్తారు. పదహారు నుంచి 59 సంవత్సరాల మధ్య వయసువారు ఈ పథకానికి అర్హులుగా కేంద్రం ప్రకటించింది. ఆదాయ పన్ను పరిధిలోకి రానివారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి 12 అంకెలున్న ప్రత్యేక గుర్తింపు కార్డుని అందజేస్తారు.
వివిధ రంగాల్లో పని చేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ వరంగా మారింది. మీ-సేవ, స్మార్ట్ మొబైళ్లలో ఈ-శ్రామ్ పోర్టల్ ద్వారా ప్రతి అసంఘటిత కార్మికుడు తన పేరు, వృత్తి, నామినీ పేరు, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ తదితర అంశాలను నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఏదైనా పరిస్థితిలో కార్మికుడికి మరణం, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.రెండు లక్షలు, పాక్షిక అంగవైకల్యమైతే రూ.లక్ష బీమా అందుతుంది. ఈ-శ్రమ్ సురక్షబీమా యోజన పథకం అన్ని రంగాల కార్మికులకు వర్తించే విధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ సమక్షంలో ఆగస్టు 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం కలుగుతున్నది. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి 12 అంకెలున్న ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారు. దీనిని యూనివర్సల్ ఐడెంటిటీ నంబర్ (యూఏఎన్) అని పిలుస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఆమోదించి ఆయుష్మాన్ భారత్తో దీనిని అనుసంధానం చేశారు.
అసంఘటితరంగ కార్మికులు పొందే లాభాలు:
ఈ-శ్రమ్ కార్డు దేశమంతటా అంగీకరించబడుతుంది. ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) కింద ప్రమాద మరణ బీమా కల్పించడం జరుగుతుంది. ప్రమాద మరణమైతే రూ.రెండు లక్షలు, పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష బీమా సాయమందుతుంది. ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా వివిధ సామాజిక భద్రతా పథకాలు సైతం అందజేయబడతాయి. విపత్తులు, మహమ్మారులు వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి.
ఈ పథకంలో చేరడానికి అర్హులు:
16 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
పన్ను పరిధిలోకి రాని వారు.
ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్), ఎంప్లాయీస్
స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్ఐ) సదుపాయం లేని వారు.
అసంఘటితరంగ కార్మిక విభాగంలో పని చేస్తూ ఉండాలి.
అసంఘటిత రంగ కార్మికులు..
వ్యవసాయ, అనుబంధ రంగాలు: చిన్న, సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాలు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్య్సకారులు, భవన నిర్మాణం, అనుబంధ రంగాల వారు. తాపీ, తవ్వకం, రాళ్లు కొట్టేపని, సెంట్రింగ్, రాడ్బెండింగ్, సానిటరీ, పెయింటర్స్, టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్సర్, బావుల తవ్వకం, పూడిక పనిచేసే వారు.
అప్పారెల్: టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రైస్ మేకర్స్.
ఆటోమొబైల్, రవాణా రంగం: డ్రైవర్లు, హెల్పర్లు.
చేతివృత్తులు: చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, క్షౌరవృత్తి, బ్యూటీపార్లర్లలో పని చేసేవారు, చర్మకారులు, రజకులు.
స్వయం ఉపాధి: వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారస్తులు, ఇంటి వద్ద వస్తువుల తయారీ, చిరువ్యాపారులు, కల్లుగీత, కళాకారులు, రిక్షా, బీడీ కార్మికులు, చెత్త ఏరేవారు.
సేవా రంగం: కొరియర్ బాయ్స్, ఇంటివద్ద రోగులకు సేవలు చేసేవారు, కమీషన్ మీద వస్తువులు సరఫరా, ఇండ్లల్లో పని చేసే వారు.
ప్రభుత్వ పథకాల్లో: ఎన్ఆర్ఈజీఎస్, ఆశ వర్కర్లు, ఎస్హెచ్జీ స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం వర్కర్లు, విద్యావలంటీర్లు, గ్రామ/ వార్డు వలంటీర్లు.
హమాలీలు: లోడింగ్, ఆన్ లోడింగ్ పనివారు.
దుకాణాలు/వివిధ సంస్థల్లో (ఈపీఎఫ్, ఈఎస్ఐ లేని వారు), ఆహార పరిశ్రమ : బేకరీ, పాల ఉత్పత్తి, ఫాస్ట్పుడ్ తయారీదారులు, వలస కార్మికులు తదితరులు ఈశ్రమ్ (ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి) అర్హులు.