Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు. అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు. సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు జరగనున్నాయి.
నవరాత్రి ఉత్సవాల్లో ఒక ముఖ్యమైన సంప్రదాయం కుమారీ పూజ. దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఈ పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కుమారి పూజలో రెండేండ్ల నుంచి పదేండ్ల వయసు ఉన్న బాలికలు అమ్మవారికి పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజలు చేస్తారు.
నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారి ఉత్సవమూర్తిని స్కందమాత స్వరూపంలో పూజిస్తారు. నవదుర్గలలో ఐదో రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగిఉండి, ఒక చేతిలో స్కందుణ్ణి పట్టుకుని, మిగిలిన చేతులలో పద్మాలను, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈమె ఒడిలో బాలుని రూపంలో స్కందుడు (కుమారస్వామి) కూర్చొని ఉంటాడు. స్కందదేవుని జనని కావడం వలన ఈ దుర్గాస్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. ఈ స్కందమాతను ఉపాసించడం వల్ల స్కందదేవుని కూడా ఉపాసన చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ దేవిని ఆరాధించడం వలన సకల కోర్కెలు నెరవేరడమే కాకుండా శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.