న్యూఢిల్లీ, మే 14 : హొర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధంలో భారత్కు మరో షాక్ తగిలింది. డ్రోన్ లేదా క్షిపణి దాడిలో భారత్కు చెందిన సరుకు రవాణా నౌక ‘హాజీ అలీ’ సముద్రంలో మునిగిపోయింది. ఎంఎస్వీ హాజీ అలీగా గుర్తించిన ఈ నౌకలోని 14 మంది సిబ్బంది ప్రమాద ఘటనలో చిక్కుకోగా, ఒమన్ కోస్ట్గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడింది.
బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ వచ్చి నౌకను ఢీకొనటంతో ఈ పేలుడు సంభవించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. ఒమన్ తీరంలో భారత జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇదెంతమాత్రమూ ఆమోదయోగ్యం కానిదిగా అభివర్ణిస్తూ, ఆ ప్రాంతంలో నౌకాయానానికి కొనసాగుతున్న ముప్పులపై ఆందోళన వ్యక్తం చేసింది.