శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 26 : చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుకోసం శ్రేణులు సైనికుల్లా పని చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లి, మల్కారం, నానాజీపూర్ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే తన నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీగా జ్ఞానేశ్వర్ను గెలిపించి పార్లమెంట్కు పంపించాలన్నారు.
పదేండ్లలో సీఎంగా కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు దాటినా.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా.. సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నట్లు చెప్పారు. చేవెళ్ల ఎంపీగా కాసానిని గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇద్దామన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నీరటి రాజుముదిరాజ్, మాజీ సర్పంచ్లు దండు ఇస్తారి, కల్పనాసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.