న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇవాళ విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. సభలో ప్లకార్డులను ప్రదర్శించరాదు అని, ఎంపీలందరూ హుందాగా ప్రవర్తించాలన్నారు. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు ఇవాళ స్పీకర్ చైర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్లకార్డులు పట్టుకున్న ఎంపీలను డిస్క్వాలీఫై చేయాలని కోరారు. వెల్లోకి విపక్షాలు రావడంతో ఆయన సభను 3 గంటల వరకు వాయిదా వేశారు. ఈ దేశ ప్రజలు సభ సవ్యంగా సాగాలని చూస్తున్నారని, కానీ ఇలా గందరగోళ రీతిలో సభ నడవడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్ని సభలో సాగనివ్వమని బిర్లా అన్నారు. మీకు ప్లకార్డులు చూపెట్టాలనిపిస్తే, వాటిని సభ బయట ప్రదర్శించాలని, చర్చల కోసం తాను సిద్ధంగా ఉన్నానని, కానీ తన మంచితనాన్ని బలహీనతగా చూడవద్దు అని స్పీకర్ బిర్లా అన్నారు.