YS Jagan | చంద్రబాబు హయాంలో స్కీములు లేవు.. స్కామ్లు మాత్రమే ఉన్నాయని ఏపీ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం నాడు విజయనగరం జిల్లా చెల్లూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన అంతా మోసం, దగా అని విమర్శించారు. ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు పని అని అన్నారు.
ఇవాళ చంద్రబాబు వెనకాల దత్తపుత్రుడు, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని అన్నారు. ఒక జగన్ మీదకు వీళ్లంతా ఏకమవుతున్నారని తెలిపారు. జగన్ ప్రజలకు మంచి చేయకపోయి ఉంటే.. వీళ్లంతా ఎందుకు ఏకమవుతున్నారని ప్రశ్నించారు. ఈ 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి పనిపై నమ్మకం ఉందని తెలిపారు. ప్రతి వర్గానికి న్యాయం చేశామని అన్నారు. చంద్రబాబు మాత్రం అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న బాబుకు, ఆ కూటమికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెప్పి.. ఆ తర్వాత మోసం చేసేవాళ్లను 420లు అని పిలవాలని అన్నారు. 420 మాత్రమే చంద్రముఖి బృందం అని కూడా అంటారన్నారు. పేదల కలల్ని అర్థం చేసుకుని.. దాదాపు 40 స్కీమ్స్ పెట్టామని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి స్కీమ్స్ లేవని అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలను రోడ్డున పాడేసి.. వారి రక్తాన్ని పీల్చిన చంద్రముఖి పాలననే చూశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను గుర్తుచేసుకోవాలని.. అదేవిధంగా మీ బిడ్డ పాలనలో ఎటువంటి మంచి జరిగిందో ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే చంద్రబాబు పని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2014లో మహిళల కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. స్కీమ్లతో ప్రజల జేబుల్లోకి డబ్బులు పంపింది ఎవరంటే జగన్ అని అంటారని.. అదే మీ జేబుల్లోని డబ్బును లాక్కున్నది ఎవరంటే చంద్రబాబు పేరు చెబుతారని అన్నారు. డ్రీమ్ ప్రజలదైతే.. స్కీమ్ మీ జగన్ది అని తెలిపారు. జగన్ చేసిన పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.