దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో గత వారం ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నిఫ్టీ 18.93 శాతం రాబడిని ఇచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపినప్పటికీ.. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడం, దేశీయ ఆర్థిక సంస్థల మదుపు కారణంగా మార్కెట్లు లాభాలను సాధించగలిగాయి. ప్రస్తుతం నిఫ్టీ స్వల్ప, దీర్ఘకాలిక చలన సగటులకు ఎగువన ట్రేడ్ అవుతున్నది. శుక్రవారం భారీ బుల్లిష్ క్యాండిల్ ఏర్పాటు చేయడం ద్వారా గత వారాంతపు అనిశ్చితిని చెరిపేసింది. దీంతో ఊగిసలాట ధోరణి నుంచి మార్కెట్ బయటపడింది. గత డౌన్ట్రెండ్లో 61.8 శాతానికిపైగా రీట్రేస్మెంట్ జరగడంతో మార్కెట్ బుల్లిష్ శక్తిని పుంజుకున్నది. అయితే ఈ వారం 18,000-18,150 స్థాయిల్లో రెసిస్టెన్స్లున్నాయి. గత రెండు గరిష్ఠ స్థాయిలను కలుపుతూ వచ్చిన ట్రెండ్లైన్ రెసిస్టెన్స్ ఇదే స్థాయిలోనే ఉన్నది. ఈ స్థాయిలకు ఎగువన ముగిస్తే మార్కెట్ మళ్లీ దీర్ఘకాల అప్ట్రెండ్లోకి ప్రవేశించడంతోపాటు కొత్త జీవిత కాలపు గరిష్ఠ స్థాయిని కూడా ఏర్పాటు చేయవచ్చు. అలాగే 17,387-17,422 స్థాయిలకు దిగువన క్లోజైతే స్వల్పకాలానికి బలహీనపడే అవకాశం ఉన్నది. ఈ స్థాయిలకు దిగువన కీలక మద్దతు 17,233. ప్రస్తుతానికి మార్కెట్లో ఎలాంటి నెగటివ్ డైవర్జెన్స్లు లేవు. అలాగే షార్ట్ పొజీషన్లకు దూరంగా ఉండండి.
ఈ వారం ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు పీఎస్యు స్టాక్స్ వెలుగులో ఉండవచ్చు. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా పాజిటివ్గా ట్రేడ్ కావచ్చు. అదానీ గ్రూపు షేర్లతోపాటు హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్బీఐ, రేమాండ్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు ఆకర్షణీయం.