ధర్మారం, మార్చి 20: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి ఆదివారం విస్త్రతంగా పర్యటించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ.3 కోట్లతో నంది మేడారంలో, రూ.2 కోట్లతో దొంగతుర్తిలో గ్రామంలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులు, ఖిలావనపర్తిలో సీఆర్ఆర్ పథకం నిధులు రూ.30 లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణానికి మంత్రి ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. నంది మేడారంలో 150 మంది ఎస్సీ కాలనీ వాసులు, గ్రామ మైనార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ సాయబ్ హుస్సేన్ అమాత్యుడి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నంది మేడారం పీహెచ్సీలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ తరఫున లక్షల విలువైన బాడీ ఫ్రీజర్ను ఆ సంస్థ చైర్మన్ కొప్పుల స్నేహలతతో కలిసి బహూకరించారు. ఈ సందర్భంగా నంది మేడారం ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో మన రాష్ట్రం అన్నింటిలోనూ నంబర్వన్గా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమ కోసం పథకాలు అమలు చేస్తుండడంతోపాటు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ‘మనఊరు- మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. మన రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ఇటీవల పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల ఎజెండాలో చేర్చడమే ఇందుకు ఉదాహరణ అని మంత్రి ఈశ్వర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా పరితపిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కళ్లులేని కబోదిలాగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విపక్ష నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. తాము దేశాన్ని ఎంతో ఉద్ధరించామని గొప్పలు చెబుతున్న బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితుల సంక్షేమం కోసం కనీస ఒక్క పథకాన్ని ప్రవేశ పెట్టారా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. పొద్దున లేస్తే బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చకొడుతూ పబ్బం గడుపుతూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మోడీ పాలనలో దళితులకు ఒరిగిందేమి లేదని ఆయన విమర్శించారు. దేశంలో దళితుల సంక్షేమానికి ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందించి వారికి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ఉద్ఘాటించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, పీఆర్ డీఈఈ శంకరయ్య, ఆయా గ్రామాల సర్పంచులు పాలి తం సత్తయ్య, సాగంటి తార, సామంతుల జానకి, ఎంపీటీసీలు దాడి సదయ్య, మోతె సుజాత, కట్ట సరోజ, మిట్ట తిరుపతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండి సలామొద్దిన్, ఉప సర్పంచులు ముత్యాల చంద్ర శేఖర్, కీసర స్వరూపారాణి, కట్ట సరోజ, ఆర్బీఎస్ మండల కోఆర్టినేటర్ పాకాల రాజయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు బాలసాని లింగయ్య, మోతె అంజయ్య, రాసూరి రాజ్కుమార్, పార్టీ నాయకులు నంది మేడారం పీహెచ్సీ వైద్యుడు సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.