హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు(Kondagattu) అంజన్న క్షేత్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా 11 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించి, జీతాలు చెల్లించిన విషయంపై కలెక్టర్ యాస్మిన్ భాష సీరియస్ అయ్యారు. సొసైటీ లేదా ఏజెన్సీల ద్వారా సెక్యూరిటీ గార్డుల సేవలను వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా సెక్యూరిటీ గార్డులను నియమించి 2023 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ దాకా జీతాలు చెల్లించారు.
ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ యాస్మిన్భాష గతంలో ఈవోగా పనిచేసిన వెంకటేశంతో పాటు ఇద్దరు పర్యవేక్షకులకు(Temple employees) మెమోలు జారీ చేశారు. అయితే ఈవోతోపాటు పర్యవేక్షకులు తమ వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని కలెక్టర్, వారిపై చర్యలకు ఉపక్రమించారు. వారిపై క్రమశిక్షణ చర్యలు(Disciplinary action) తీసుకోవాలంటూ ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదికను దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్కు ఇటీవలే పంపించారు.
ఇప్పటికే ఆలయ నిధులను పక్కదారిపట్టిన విషయంలో పలువురి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా సెక్యూరిటీ గార్డుల వ్యవహారం బయటికిరావడం, చర్యలు తీసుకోవాలంటూ దేవాదాయ కమిషనర్కు కలెక్టర్ నివేదించడంతో ఆలయ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.