నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సోమవారం దీక్షాదివస్ను ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని తారస్థాయికి చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని అంతటా సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. నాటి దీక్షతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిందంటూ కేసీఆర్ మడమ తిప్పని పోరాటాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ అమరవీరుల జంక్షన్ వద్ద నిర్వహించిన దీక్షా దివస్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి హాజరుకాగా, టీఆర్ఎస్ శ్రేణులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సీఎం కేసీఆర్ దీక్షతోనే స్వరాష్ట్రం సాకారమైందనని దాస్యం పేర్కొన్నారు. అలాగే వరంగల్లోని తెలంగాణ జంక్షన్లో ఏర్పాటుచేసిన దీక్ష దివస్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేసిన కృషిని, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన పదవీ త్యాగాలను, పోరాటాల చరిత్రను వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని గడపగడపకూ వెళ్లి వివరిస్తామని చెప్పారు. ఇక మిగతా చోట్ల నాయకులు, కార్యకర్తలు దీక్షా దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.