న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్కు ఏబీ డివిలియర్స్ జట్టులోకి వస్తాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచనప్రాయంగా తెలిపాడు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘డివిలియర్స్ను చాలా మిస్సయ్యాను. తరచూ అతడితో మాట్లాడుతున్నా. ప్రస్తుతం డివిలియర్స్ కుటుంబంతో కలిసి అమెరికాలో గోల్ఫ్ ఆటను చూస్తున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అతడు ఇక్కడకు (బెంగళూరు జట్టులోకి) వస్తాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నాడు. అనంతరం ఈ సీజన్లో మూడు గోల్డెన్ డకౌట్స్పై స్పందిస్తూ.. ‘జీవితంలో అన్నీ చూడాలి కదా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ‘నా కెరీర్లో ఇలాంటివి ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డివిలియర్స్.. నిరుడు ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజా సీజన్కు ఏబీడీ.. ఆర్సీబీ జట్టులో సహాయక బృందంలో ఉంటాడని అందరూ భావించారు. కుదరకపోవడంతో వచ్చే ఏడాదైనా జట్టులో ఉంటాడని విరాట్ కోహ్లీ తెలిపాడు.