హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏడాది పాటు రోడ్లపైన ఎండనక, వాననక నానా అవస్థలు పడి.. ప్రాణాలు కోల్పోయిన రైతాంగానికి అత్యున్నత మానవీయ దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయం చేయబూనితే దానిపైనా రెండు జాతీయ పార్టీలు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలను ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం చేయడాన్ని కూడా తప్పుపట్టడం దుర్మార్గమని, ఇంతకన్నా నీచమైన రాజకీయం మరొకటి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఏనాడైన రైతులకు ఏకాణా ఇచ్చాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పంజాబ్ రైతులకు సాయం చేస్తూ సొంత రాష్ట్ర రైతులను పట్టించుకోవడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్పై ఆయన ధ్వజమెత్తారు. దేశం మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వమొక్కటే రైతు పక్షపాత ప్రభుత్వమని నొక్కిచెప్పారు. ప్రతిఏటా రూ.60 వేల కోట్లు రైతుల కోసం, వ్యవసాయం కోసం ఖర్చు చేస్తున్నదని, దేశంలో మరే రాష్ట్రం ఈ తరహాలో ఖర్చు చేయడం లేదని సోమవారం జారీచేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై నిందలేసేముందు ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి మాట్లాడాలని సవాల్ చేశారు. తమ ప్రభుత్వ కాలం.. రైతులకు స్వర్ణయుగమని అభివర్ణించారు. రైతుబంధు కింద ఏడాదికి రూ.15 వేల కోట్లుకు పైగా ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. రైతు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల రైతుబీమా చెల్లించి ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నదని వివరించారు. రైతుబీమా కింద గడిచిన మూడేండ్లలో రూ.5 లక్షల చొప్పున 67,699 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్టు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం రూ.3,384.95 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. 2021-22 సంవత్సరానికి 35.64 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే రైతుబీమా పాలసీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడం మానుకోవాలని కాంగ్రెస్, బీజేపీలకు హితవు పలికారు.