హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో డీఎస్పీ, బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం పట్ల రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ తన ప్రత్యర్థి గువో యి జువాన్పై 5-0 తేడాతో ఘన విజయం సాధించడం తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణం అన్నారు. ఆమె సామర్థ్యానికి, అంకితభావానికి ఫైనల్స్లో విజయం నిదర్శనమని డీజీపీ కొనియాడారు.
‘గోల్డ్ మెడల్ సాధించి, తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్కు అభినందనలు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన ఆమె విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శం’ అని డీజీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తెలంగాణ పోలీస్ కుటుంబం తరఫున నిఖత్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీజీపీ ఆకాంక్షించారు.