హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖపై ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధార ఆరోపణలని డీపీజీ కార్యాలయం ఖండించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. డీజీపీ, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, ఉన్నతాధికారుల మధ్య విభేదాలున్నాయనేది అవాస్తవమని, అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉందని కార్యాలయం పేర్కొంది. ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే పోలీస్ శాఖలో పోస్టింగులు ఇచ్చామని, నిరాధార ఆరోపణలతో పోలీసుల ఆత్మస్థయిర్యం, మనోధైర్యం దెబ్బతింటుందని పేర్కొన్నది.
మావోయిస్టులు ఉంటే బాగుండేదని రేవంత్ అనటం సరైంది కాదని.. ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టులు బలి తీసుకున్నారని తెలిపింది. మావోయిస్టుల ఏరివేతలో 350 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, రేవంత్రెడ్డి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారమే పోలీసు శాఖ నడుచుకుంటుందని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.