చేర్యాల, మే 5 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో(Mallanna temple) ఆదివారం భక్తులు(Devotees )స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని సుమారు 12 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకున్నారు.
మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో ఈవో ఏ.బాలాజీ,ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.