చేర్యాల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు మల్లన్న స్వామి..మమ్మేలు స్వామి నినాదాలతో స్వామి వారి ఆలయం మార్మోగింది. శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాకా ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది.
భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు అచరించి క్యూలైన్ల ద్వారా స్వామి వారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి కల్యాణోత్సవం ముగిసిన నాటి నుంచి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రతి అదివారం కొమురవల్లికి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.