హుజూరాబాద్ : హుజూరాబాద్ కు సరికొత్త కళ వచ్చింది. ఏండ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ పట్టణాన్ని రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో కేవలం మూడు నెలల్లో ప్రగతిబాట పట్టించింది. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే బురదకొట్టుకుపోయే మట్టిరోడ్లు.. ఇప్పుడు సీసీతో కళకళలాడుతున్నాయి.
మురికినీరు వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేనిచోట డ్రైనేజీలు నిర్మించడంతో దుర్గంధం కష్టాలు తీరాయి. ఇలా రోడ్లు, డ్రైనేజీలే కాదు..ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.70 కోట్లతో చేపట్టిన ఈ పనులతో ఇప్పుడు ఏ కాలనీలో చూసినా కండ్లముందే అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయి.
గత ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో రెండు దశాబ్దాలుగా ఆగమైన పట్టణం.. అక్కడి ప్రజానీకం.. ప్రస్తుతం జరుగుతున్న కండ్లముందే అభివృద్ధి అభివృద్ధిని చూసి ఆనందం వ్యక్తంచేస్తున్నది.
హుజూరాబాద్ మున్సిపాలిటీ. ఓ చైతన్యవంతమైన ప్రాంతం. దాదాపు 50వేల జనాభా ఉంటుంది. పట్టణంలో 30 వార్డులు ఉండగా, అందుకుతగ్గ వసతులు లేక ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నది. గత పాలకుడు ఏండ్లకేండ్లు ఏకచత్రాధిపత్య పాలనతో ఏ ఒక్క పని కాక నరకం చూసింది.
డ్రైనేజీలు, సీసీరోడ్లు, ఇతర మౌలిక వసతులు లేక గోసపడ్డది. కానీ విషయం తెలిసిన రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో రెండు నెలల్లో తన రూపురేఖలు మార్చుకొని నవ్వుతున్నది.
రూ.70 కోట్లతో పనులు..
హుజూరాబాద్ పట్టణం గతి మారింది. ప్రజల డిమాండ్ తెలుసుకున్న రాష్ట్ర సర్కారు అధికారులను పురమాయించి యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేసి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇంకేముంది మంజూరైన నిధులతో జూరాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా పరుగెత్తాయి.
రూ.50 కోట్ల నిధులతో మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డుల్లో సీసీరోడ్లు, మురుగు కాలువలు నిర్మించగా, రూ.10 కోట్లతో మిషన్ భగీరథ పథకం కింద యుద్ధప్రాతిపదికన ప్రతి వాడలో నూతన పైప్లైన్ నిర్మించారు. అలాగే మరో రూ.10 కోట్లతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా ఎన్నికల కోడ్ రావడంతో కొన్నిచోట్ల పనులు ఆగిపోయినప్పటికీ నూటికి 90శాతం పనులను పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 70రోజుల్లో రూ.70 కోట్ల అభివృద్ధి పనులు చేసి ఔరా అనిపించారు.
ఇంత స్పీడ్గా చేస్తరనుకోలె.. : కొలిపాక శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు,
గత పాలకుడు హుజూరాబాద్ను పట్టించుకోకపోవడంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డా రు. ఈ క్రమంలో మంత్రు లు హరీశ్రావు, గంగుల కమలాకర్, రాష్ర్ట ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకొని హుజూరాబాద్లో అభివృద్ధి పనులను పరుగు లెత్తించారు.
మెజార్టీ ప్రాంతా ల్లో పనులు పూర్తికాగా, మిగతా చోట్ల చురుగ్గా సాగుతున్నాయి. అనతి కాలంలోనే ఎంతో చిత్తశుద్ధితో పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న రాష్ర్ట ప్రభుత్వానికి హుజూరాబాద్ పట్టణ ప్రజలందరూ రుణపడి ఉంటారు.
పభుత్వం చేయూత మరువలేనిది : గందె రాధిక, మున్సిపల్ చైర్ పర్సన్,
హుజూరాబాద్ పట్టణ అభివృద్ధిపై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసింది. రూ.70 కోట్లతో రెండు నెలల్లోనే 90శాతం పనులు పూర్తి చేసింది. గతంలో ఏ వసతులు లేక ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నరకం చూశారు. ఎవరిని అడిగినా ఏం చేయలే. ఇప్పుడు అందరికీ అన్ని వసతులు సమకూరాయి. రాష్ట్ర సర్కారుకు బల్దియా ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారు.
రెండు నెలల్లోనే పనులైనయ్..: కాశిరెడ్డి తిరుపతిరెడ్డి, రాంపూర్,
రెండు నెలలసంది నియోజకవర్గంలో పనులన్నీ అయితాన్నయ్. ఊర్లర్ల అభివృద్ధి పనులు జోరుగా చేస్తున్రు. అప్పట్ల సీసీరోడ్లు, మురికికాలువల కోసం ఎంత తిరిగినా పని కాలేదు. అప్పటికీ, ఇప్పటికీ చాలా ఫరక్ ఉన్నది. వానకాలంల మట్టిరోడ్ల మీద నడువాల్నంటె చాన ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు సీసీ రోడ్లు, డ్రైనేజీలు కట్టుట్ల మా సమస్య తీరింది.
చినుకుపడితే చిత్తడి అయ్యేది : నిమ్మ రాజయ్య, ధర్మరాజుపల్లి,
మా ఊర్లో రోడ్లన్నీ చినుకు పడితే చిత్తడిగా మారెటియ్. ఈ సమస్యను ఏండ్ల నుండి చూస్తాన్నం. మోరీలు లేక మురికి నీళ్లు రోడ్లపై పారేటివి. ఇగ దోమల సంగతి అందరికీ ఎరుకనే. అవి జేయవట్టి చానా మంది పానాలు సుస్థయినయ్. ఇప్పుడు ఊర్ల సీసీ రోడ్లు, మోరీలు కట్టిన్రు. ఇగ మా బాధలు తీరినయ్.