అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనంతపురంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గొందిరెడ్డి పల్లి గ్రామంలో తలపెట్టిన నిరసనకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు శ్రీరామ్ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని ఆయనను గృహనిర్బంధించారు.
విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు శ్రీరామ్ ఇంటి వద్దకు భారీగా చేరుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగు మోటార్లకు మీటర్ల బిగింపును వెనక్కి తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల సునీత, రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పోలీసులు గృహనిర్బంధం చేశారు.