భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : దళితబంధు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. ‘దళితబంధు లబ్ధిదారుల వివరాల ఆన్లైన్ ప్రక్రియ, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల ఆన్లైన్ ప్రక్రియ, ఆడిట్ పేరాలు పరిష్కారానికి చర్యలు, మన ఊరు – మన బస్తీ – మన బడి, శ్రీరామనవమి ఏర్పాట్లు’ తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దళితబంధు లబ్ధిదారుల ఆన్లైన్ ప్రక్రియ ఇల్లెందు, వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో పూర్తయిందన్నారు. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల ఆన్లైన్ ప్రక్రియను మంగళవారం నాటికి పూర్తి చేయాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నందున తహసీల్దార్లు పర్యవేక్షించాలని సూచించారు. శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణలో అధికారులకు కేటాయించిన విధులపై చేపట్టిన చర్యల నివేదికలను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచనారాణి, డీఆర్డీవో మధుసూదన్రాజు, ఉద్యాన శాఖ అధికారి మరియన్న, డీసీవో వెంకటేశ్వర్లు, రోడ్లు, భవనాల శాఖ ఈఈ భీమ్లా, పరిశ్రమల శాఖ జీఎం సీతారాం, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ అనసూర్య, సంక్షేమ అధికారి వరలక్ష్మి, డీఆర్వో అశోక్చక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.