ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారులకు సూచించే నియమావళిలో ఓ ఆశ్చర్యకరమైన నిబంధన ఉంది. అదేమిటంటే.. ఓటరు పేర్కొన్న చిరునామాకు రెండు కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి! వృద్ధులు, రవాణా సౌకర్యం లేనివారు సైతం ఓటు వినియోగించుకునేందుకు చేసిన ఏర్పాటు ఇది. అందుకనే ఒక్క ఓటరు ఉన్నా ఆ ఏక్ నిరంజన్ కోసం యంత్రాంగమంతా కదలాల్సిందే!
అరుణాచల్ ప్రదేశ్లోని మలోగామ్ అనే మారుమూల ప్రాంతంలో ఒకే ఒక్క ఓటరు ఉన్నాడు. అతడిని చేరుకునేందుకు, అయిదుగురు పోలింగ్ అధికారులు చేయని సాహసమంటూ లేదు. నాలుగురోజుల పాటు 300 మైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. దారిలో ఎక్కడైనా ఓ గ్రామం కనిపించినా తలదాచుకునే పరిస్థితి లేదు. కరెంటు కానీ, సెల్ఫోన్ సిగ్నల్స్ కానీ పలకరించవు. సముద్రమట్టం నుంచి వేల అడుగుల ఎత్తున.. దట్టమైన అడవులను దాటుకుంటూ, క్రూర మృగాలను గమనించుకుంటూ ఎన్నికల రోజు తెల్లారేసరికి, వాళ్లు ఎలాగోలా మలోగామ్ చేరుకున్నారు.
గుజరాత్లోనూ ఇలాంటి సందర్భమే ఎదురైంది. అక్కడి దట్టమైన గిర్ అడవుల నడుమ ‘బంగంగేశ్వర్ మహదేవ్’ ఆలయం ఉంది. దాని పూజారి భరత్దాస్. ఆ ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరం వరకూ ఓటు వేసే సౌలభ్యం లేకపోవడంతో, ప్రభుత్వం ఆయన కోసం పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసింది. ఈ ఒక్క ఓటరు హక్కు కోసం అయిదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహించారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవన్నీ గమనించిన వాషింగ్టన్ పోస్టు ప్రత్యేక కథనాన్నే ప్రచురించింది. పోలింగ్ అధికారుల మీద ప్రశంసలు కురిపించింది ‘ఓటర్ల కోసం వాళ్లు దట్టమైన అడవులను ఛేదిస్తారు, ఆక్సిజన్ సిలండర్లు పెట్టుకుని హిమాలయాలు ఎక్కుతారు, మొసళ్ల జలపాతాలను దాటి గమ్యాన్ని చేరుకుంటారు. అందరికీ ఓటుహక్కు అందాలన్న నిబద్ధతను ప్రతిఫలించే సందర్భాలివి’ అని అబ్బురపడింది. నిజమే, ఎన్నికల నిర్వహణలో మన తర్వాతే ఎవరైనా. మేరా భారత్ మహాన్.