ఆదిలాబాద్, సెప్టెంబరు 24 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్లో రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో అధికారి, సిబ్బంది రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఏడు నెలల తర్వాత జిల్లాలో రెవెన్యూ శాఖ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఆదివారం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు మావల తహసీల్ కార్యాలయంపై దాడి చేశారు. రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ హన్మంతరావు, విచారణ అనంతరం తహసీల్దార్ అరిఫాను అరెస్ట్ చేశారు. డీఎస్పీ రమణమూర్తి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్కు చెందిన రైతు యతీంధ్రనాథ్ యాదవ్ మావల శివారులో ఉన్న 14 ఎకరాల భూమికి సంబంధించిన నాలుగు పాసు పుస్తకాల్లో సవరణ కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నాడు.
ధరణి పోర్టల్లో మావల తహసీల్దార్ ఇందుకు సంబంధించిన వివరాలను పంపాల్సి ఉంది. ఇందుకోసం తహసీల్దార్ రైతు వద్ద రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆదివారం మావల తహసీల్ కార్యాలయంలో ఆర్ఐ హన్మంతరావు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ అనంతరం తహసీల్దార్ను సైతం అరెస్ట్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ రమణమార్తి తెలిపారు. ఈ దాడిలో ఆదిలాబాద్ ఇన్స్పెక్టర్ జానీరెడ్డి, కరీంనగర్ ఇన్స్పెక్టర్ రవీందర్, వరంగల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శ్యాంసుందర్ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ డీఎస్పీ ఫోన్ నంబర్ 91543 88963, ఆదిలాబాద్ ఇన్స్పెక్టర్ 91543 88965కు ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ తెలిపారు.