న్యూఢిల్లీ : దేశ రాజధానిలో 70 సంవత్సరాల తర్వాత మే నెలలో బుధవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తౌటే తుఫాను ప్రభావం, పాశ్చాత్య అవాంతరాల కారణంగా ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు చేరాయి. 1951 తర్వాత మే నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ఇంతకు ముందు 1982 మే13న కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీలకు పడిపోగా.. 1951లో నమోదైన 23.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతే ఇంతవరకు అత్యల్పమని సఫ్దర్జంగ్ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఢిల్లీలో బుధవారం రాత్రి 8.30 గంటల వరకు 60 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇది 35 సంవత్సరాల్లో మే నెలలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. 1976, మే 24న 24 గంటల్లో 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో బుధవారం కురిసిన వర్షపాతం తౌటే తుఫాను, పాశ్చాత్య అవాంతరాల కారణంగా కురిసిందని ఐఎండీ పేర్కొంది. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పింది.
రాత్రి 8.30 తర్వాత ఎక్కువ వర్షం కురిసిందని, దీంతో ఇప్పటికే ఉన్న రికార్డు అధిగమించినట్లు జాతీయ వాతావరణ అంచనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనమణి తెలిపారు. మే నెలలో వాతావరణం పొడిగా ఉంటుంది, సాధారణంగా ఈ నెలలో ఢిల్లీలో గరిష్ఠంగా 30-40 మిల్లీ మీటర్ల వర్షం (24గంటల్లో) నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫానుకు పాశ్చాత్య అవాంతరాలు తోడవడంతో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైందని చెప్పారు. పాలమ్లో 36.8, ఎస్పీఎస్ మయూర్ విహార్లో 39.5, నజాఫ్గఢ్లో 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.